టీడీపీ సీనియర్ నేత కేశినేని ఆఫ్ ద రికార్డ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. చంద్రబాబుపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచే పరిస్థితి లేదని, అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నట్లు తెలిసింది. గెలిచే శక్తి, యుక్తి చంద్రబాబుకు లేదన్నారు. ఉన్నది ఉన్నట్లు చెప్పే వారి మాటలు చంద్రబాబు నమ్మడని, లోఫర్లు, బ్రోకర్లు చెప్పే మాటలకే విలువ ఇస్తారని ఆరోపణలు చేశారు.
తనకు రాజకీయాల్లో కొనసాగాలనే ఆలోచన లేదని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో ఏక్ నాధ్ షిండేలా ఏపీలో సీఎం రమేష్ ఉన్నాడని.. ఆయన బీజేపీలో ఉన్నా, టీడీపీకే పని చేస్తాడని నాని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 50, 60 సీట్లు టీడీపీ వస్తే ఏక్ నాధ్ షిండే తరహాలో సీఎం రమేష్తో ఆపరేషన్ చేస్తారని విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఆఫ్ ద రికార్డే అయినా.. ఎలాగో అధిష్టానం దృష్టికి వెళ్ళడంతో మ్యాటర్ సీరియస్ గా మారింది.
ఇదిలావుంటే.. టీడీపీ హైకమాండ్ కేశినేని నాని తమ్ముడు కేశినేని చిన్నికి ప్రాధాన్యత ఇస్తోంది. పార్టీ టిక్కెట్ కూడా ఇవ్వాలని భావిస్తోంది. టీడీపీలో కొన్ని గ్రూపులను ప్రోత్సహిస్తుండడంతో నానికి చెక్ పెట్టేందుకు చిన్నిని చంద్రబాబు తెరపైకి తెచ్చినట్లు సమాచారం. ఇది నానికి మింగుడుపడని విషయం. దీంతో తమ్ముడిని ఎంపీ స్టిక్కర్ కేసులో ఇరికించినట్లు తెలుస్తోంది. నానినే స్వయంగా హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఆంతర్యం ఇదేనని చెప్పుకుంటున్నారు.
ఇక ఎంపీ స్టిక్కర్ విషయానికి వస్తే.. కేశినేని నానికి ప్రభుత్వం జారీ చేసిన ఎంపీ స్టిక్కర్ను, తన కారుకు అంటించుకుని చిన్ని తిరుగుతున్నాడ. దీనిపై కేశినేని నాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేశినేని చిన్ని భార్య జానకిలక్ష్మీ పేరిట రిజిస్టర్ అయి ఉన్న ఆ కారును హైదరాబాద్లో పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ అయింది.
అయితే దీనిపై కేశినేని చిన్ని స్పందిస్తూ.. ఇదో చిల్లర వివాదమంటూ కొట్టి పారేశారు. ఇందులో రాజకీయ కోణమేమీ లేదని, వ్యక్తిగత వివాదమే అని తేల్చేశారు. నాని తనకు సొంత అన్నయ్యే కానీ శత్రువు కాదన్నారు. తానెప్పుడు పార్టీ టిక్కెట్ ఆశించలేదని, పార్టీ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో నాని విజయం కోసం కృషి చేస్తానని చెప్పారు. తనపై రాజకీయంగా విమర్శలు చేయచ్చు గానీ… ఇంట్లో ఆడవాళ్లను బయటకు లాగడం సరికాదని చిన్ని వ్యాఖ్యానించారు.