ఒకరు కాదు ఇద్దరు కాదు… ఏకంగా 30 మంది యువతులను మోసం చేసి కోట్లకు పడగలెత్తాడు ఓ జులాయి. పెళ్ళి చేసుకుంటానని నమ్మించి, వారి వద్ద నుంచి డబ్బులు కాజేసి ఆ తర్వాత మొహం చాటేశాడు. ఓ యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని కటకటాల వెనక్కి నెట్టారు.
వివరాల్లోకి వెళితే, ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కొటికలపూడికి చెందిన శ్రీనివాస్ పెళ్ళి పేరుతో మోసాలకు అలవాటు పడ్డాడు. అసలే బట్టతల. అయితే ఇలా ఉంటే యువతుల్ని మోసం చేయడం కష్టమని భావించి, విగ్గులు తయారు చేయించుకుని వాటితో ఫోటోలు తీసుకుని మ్యాట్రిమోనియల్ లో పెట్టేవాడు. ఎక్కువగా సాఫ్ట్ వేర్ యువతులనే టార్గెట్ చేసుకుని మాయమాటలు చెప్పి పెళ్ళి చేసుకుంటానంటూ ముగ్గులోకి దించేవాడు. కొన్నాళ్ళకు అవసరం ఉందంటూ వారి వద్ద నుంచి పెద్దమొత్తంలో డబ్బులు డ్రా చేయించి తన ఖాతాకు బదిలీ చేయించుకునేవాడు. వారితో లోన్లు పెట్టించి, ఆ డబ్బులు కూడా తీసుకునేవాడు. ఇలా ఏకంగా 30 మంది యువతులను తన మాటలతో బురిడీ కొట్టించి మోసం చేశాడు. ఆ డబ్బులతో జల్సాలు చేయడంతో పాటు గంజాయి అక్రమ రవాణా చేస్తుండేవాడు. ఇలా ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక తదితర రాష్ట్రాల యువతులను పెళ్ళి పేరుతో నమ్మించి లక్షలు లక్షలు దోచుకున్నాడు.
ఇటీవల హైదరాబాద్కి చెందిన ఓ యువతిని ఇలాగే మ్యాట్రిమోనియల్ ద్వారా పరిచయం చేసుకుని ఆమె వద్ద నుంచి రూ.1.35 లక్షలు కాజేశాడు. ఆ తర్వాత శ్రీనివాస్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో ఆమెకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి అతని కోసం ప్రత్యేక బృందం గాలింపు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో చిత్తూరు నగర శివార్లలోని మురకంబట్టులో తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పద వ్యక్తి నుంచి నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని విచారించారు. ఆ వ్యక్తి శ్రీనివాస్ కావడంతో, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దీంతో పెళ్ళి పేరుతో చేసిన మోసాలన్నీ బయటపడ్డాయి. ఇప్పటివరకు 30మంది యువతులను మోసం చేసి కోట్లలో నగదు కాజేసినట్లు విచారణలో తేలింది. నిందితుడిని అరెస్టు చేసిన చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.
ఇవీ చదవండి..