గూఢచారి సాఫ్ట్ వేర్ పెగాసస్ ఇప్పుడు చంద్రబాబును చుట్టుకుంది. ఇదేదో వైసీపీ నాయకులు చేసిన ఆరోపణలు కాదు. సాక్షాత్ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ చేసిన ఆరోపణ. పెగాసస్ చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొనుగోలు చేశారని ఆమె చెప్పింది. 25 కోట్ల రూపాయలకు ఆ సాప్ట్ వేర్ తమకు ఇస్తామని చెప్పినా, తమ పోలీస్ శాఖ నిరాకరించిందని కూడా తెలిపింది.
సెల్ ఫోన్లను ట్రాకింగ్ చేసేందుకు ఇజ్రాయిల్ రూపొందించిన ఈ పెగాసెస్ సాఫ్ట్ వేర్ అత్యంత వివాదాస్పదమైంది. దీన్ని ఇతరుల మొబైల్ లోకి చొప్పిస్తే, ఆ మొబైల్ కి వచ్చే మెసేజ్లు, ఫోటోలు తదితర వివరాలన్నీ కూడా ట్రాక్ చేసే అవకాశముంది. లోకేషన్ ట్రాకింగ్ కూడా ఉంటుంది. కొన్నింటికైతే మాట్లాడేటప్పుడు మాటలను కూడా రికార్డ్ చేసే అవకాశం, పరిసర ప్రాంతాలను వీడియో రికార్డింగ్ చేసే సదుపాయం ఉంటుంది. ఈ సాఫ్ట్ వేర్ తో ఇతరుల వ్యవహారాలన్నింటినీ మొబైల్ ద్వారా తెలుసుకోవచ్చు.
వివాదాస్పదమైన ఈ సాప్ట్ వేర్ మానవ హక్కులకు, వ్యక్తిగత స్వేచ్చలకు విఘాతం కలిగిస్తోందని ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అలాంటి పెగాసస్ సాఫ్ట్ వేర్ చంద్రబాబు కొన్నారని మమతాబెనర్జీ ఇప్పుడు చెప్పడమే వివాదాస్పదమైంది. ఈ విషయమై ఇప్పుడు లోకేష్ కూడా ఒక వివరణ ఇచ్చాడు.
అప్పట్లో ఐటీ మినిస్టర్ గా ఉన్న లోకేష్ పెగాసస్ సాఫ్ట్ వేర్ తమకు అమ్ముతామని చెప్పిన మాట నిజమేనని, అయితే దాన్ని కొనుగోలు చేసేందుకు తాము ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. మమతాబెనర్జీ అలా ఎందుకు చెప్పిందో తనకు తెలియదన్నారు. ఈ విషయాలను ఆమె నేరుగా అసెంబ్లీలో చెప్పడమే ఇంతటి వివాదానికి కారణమైంది.