ఇతర మతాలకు చెందిన వారెవరైనా సరే.. విశ్వాసంతో, నమ్మకంతో, భక్తితో ఒక దేవాలయ ప్రవేశం కోరినప్పుడు కాదనేది లేదని మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఆ దేవాలయంలోని దేవుడిపై నమ్మకంతో పూజలు చేసేందుకు ఇతర మతస్తులను అడ్డుకోవడం.. ప్రాధమిక హక్కును కాలరాయడమే అవుతుందని పేర్కొంది. న్యాయమూర్తులు టీఎన్.ప్రకాష్, హేమలత సభ్యులుగా ఉన్న డివిజన్ బెంచ్ .. తిరువత్తూరులోని ఆదికేశవులు పెరుమాళ్ దేవాలయ కుంభాభిషేకంపై దాఖలైన పిటీషన్పై విచారించింది.
ఈ కుంభాభిషేకానికి క్రిస్టియన్ మతానికి చెందిన ఒక మంత్రిని ఆహ్వానించారని, ఆయన పేరు ఆహ్వానపత్రిలో కూడా వేశారని, అందువల్ల ఆయనకు దేవాలయ ప్రవేశం లేకుండా చేయాలన్న పిటీషన్పై కోర్టు విచారించింది. ఈ సందర్భంగా క్రైస్తవుడైన గాయకుడు ఏసుదాస్ హిందూ దేవుళ్ళ గురించి భక్తితో అద్వితీయమైన పాటలను కూడా కోర్టు ఉదహరించింది. అయ్యప్పస్వామి ఆలయంలో, వేళాంగిణి ఆలయం, నాగూర్ దర్గాలోనూ ఏసుదాస్ పాటలు పాడారని గుర్తు చేసింది. కుంభాభిషేకం వంటి పెద్ద కార్యక్రమం జరిగేటప్పుడు, దేవాలయంలోకి వచ్చే ప్రతిభక్తుడిని ఏ మతం అని అడగడం కూడా అధికారులకు వీలు కాని పని అని పేర్కొంది.