ఏప్రిల్ లోనే చురుక్కుమంటున్న ఎండలు, భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీ ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే వార్త ఇది. మరో నాలుగు రోజులపాటు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కబురందించింది. వాయవ్య బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలు, ఉత్తరాంద్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తా,రాయలసీమ జిల్లాల్లో కూడా రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పిడుగులు పడే అవకాశం ఉందని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రెండు వారాలుగా మండిపోతున్న ఎండలతో ఏపీ వాసులకు కాస్త ఉపశమనం కలిగే అవకాశం ఉందని తెలిపింది.