ప్రేమించిన అబ్బాయి కోసం.. కోర్టుకు వెళ్ళిన అమ్మాయిల్ని చూసుంటాం. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడానికి కోర్టుకి వెళ్ళిన అబ్బాయిలను చూసుంటాం. కానీ ఓ అమ్మాయి కోసం సహజీవనం చేసిన మరో అమ్మాయి కోర్టుకి వెళ్ళడం ఎప్పుడైనా చూశారా ? కనీసం విన్నారా ? అదే ఇది. చిన్ననాటి నుంచి ఒకే స్కూల్, ఒకే కాలేజీలో చదువుకున్న ఇద్దరు అమ్మాయిల సహజీవనం … ఓ సినిమాలా ఉంటుంది. హౌస్ అరెస్టులు.. కేసులు… కోర్టులు… అబ్బో.. ఎన్నో ట్విస్టులు. ఇలాంటి ట్విస్టులకు చివరగా కేరళ హైకోర్టు ముగింపు ఇచ్చింది. ఆ ఇద్దరు అమ్మాయిలకు అనుకూలంగా సంచలన తీర్పు ఇచ్చింది.
కేరళలోని కోజీకోడ్ ప్రాంతానికి చెందిన ఆదిలా నజ్రీన్, ఫాతిమా ఇద్దరు బాల్య స్నేహితురాళ్ళు. ఒకే స్కూల్లో చదివారు. స్కూల్ డేస్ లో స్నేహంగా ఉన్న వీరిద్దరూ టీనేజ్లో కాలేజీలోకి అడుగు పెట్టాక.. వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ కాస్తా.. సహజీవనానికి దారి తీసింది. అందరూ వీరిద్దరూ మంచి స్నేహితురాళ్ళే అనుకున్నారు. కానీ వీరు గత కొంతకాలంగా సహజీనం చేస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో… చూసిన వారంతా అవాక్కయ్యారు. చివరికి ఇరువురి తల్లిదండ్రులకు తెలియడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో ఫాతిమా పేరెంట్స్ వచ్చి నజ్రీన్ నుంచి వేరు చేసి ఇంటికి తీసుకెళ్ళారు. లెస్బియన్ సంబంధాన్ని మానుకోవాలని హితవు చెప్పారు. ఫాతిమాను కలవకుండా కట్టడి చేశారు. దీంతో ఫాతిమా పోలీసులను ఆశ్రయించింది. అయినా ఫలితం లేకపోవడంతో కేరళ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దీంతో ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఫాతిమాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. స్వలింగ సంపర్కాలకు చట్టం అనుమతి ఉందని పేర్కొంది. వారిద్దరూ మేజర్లే అయినందున వారి హక్కులకు భంగం కలిగించడం తీవ్రంగా పరిగణిస్తామని, వారి విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది. వారిద్దరూ కలిసే ఉండవచ్చని స్పష్టం చేసింది. జస్టిస్ వినోద్ చంద్రన్ తో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.