వైసీపీలో జగన్కు ఆయన తల్లి విజయమ్మకు, సోదరి షర్మిలకు మధ్య విభేదాలు ఉన్నాయన్న పుకార్లను శుక్రవారం నాటి ప్లీనరీ సమావేశం వమ్ము చేసింది. ప్లీనరీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తర్వాత విజయమ్మ చేసిన ప్రసంగం.. జగన్ కుటుంబంలో ఎలాంటి విబేధాలు, గొడవలు లేవని స్పష్టం చేసింది.
జగన్మోహన్ రెడ్డిని అకారణంగా జైలులో పెట్టినప్పుడు తమ కుటుంబం గురించి మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని, తాను జగన్, షర్మిల ఇద్దరికీ తల్లినేనని, తెలంగాణ వైఎస్సార్ పార్టీలోనూ, ఇక్కడి వైసీపీ పార్టీలోనూ తాను గౌరవ అధ్యక్షురాలి గానే ఉన్నానని పేర్కొన్నారు.
ఒకప్పుడు తన కొడుకు జగన్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తాను పార్టీకి అండగా ఉన్నానని తెలిపారు. తన కూతురు షర్మిల తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీ పెట్టుకుందని, తన తండ్రి వైఎస్ఆర్ ఆశయాలను సాధించేందుకు పోరాటం చేస్తోందన్నారు. ఒంటరి పోరాటం చేస్తోన్న షర్మిలకు అండగా ఉండేందుకు తాను తెలంగాణలో ఉంటానని అన్నారు. అందువల్లే తాను ఏపీ వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తమ కుటుంబంలో మనస్పర్థలు ఉన్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వీటికి ముగింపు పలికేందుకు పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. తన కొడుకు జగన్ను మీ అందరి చేతుల్లో పెడుతున్నానని చెప్పిన ఆమె… తల్లిగా జగన్ కు ఎప్పుడూ అండగా ఉంటానని తెలిపారు.
రెండు రాష్ట్రాల రాజకీయ ప్రతినిధులుగా తన కొడుకు, కూతురు ఆ యా రాష్ట్రాల ప్రయోజనాల కోసమే పని చేస్తారని తెలిపారు. వైఎస్ఆర్ హావ భావాలకు, రాజకీయ వారసత్వానికి ఇద్దరూ సమర్ధులైన వారసులేనని చెప్పారు. ఈ రాష్ట్రంలో పనిలేని మీడియా అనవసరంగా ఈ విషయంలో దుష్ప్రచారం చేస్తోందని విజయమ్మ తెలిపారు. రాబోయే తెలంగాణ ఎన్నికల్లో తన కూతురు ఆధ్వర్యంలోనే తెలంగాణ వైసీపీ పార్టీ గట్టిగానే పోటీ చేయబోతోందని చెప్పారు. తెలంగాణలో షర్మిల రాజకీయ ఏర్పాటు తమ కుటుంబంలో విబేధాలు వచ్చాయన్న వార్తలు అబద్దమని తేల్చిచెప్పారు.
ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావు లేదన్నారు. విజయమ్మ ప్రసంగం ప్రధానంగా షర్మిల, జగన్ మద్య విబేధాలు లేవనే విషయాన్ని చెప్పేందుకు ప్రధాన్యత ఇచ్చారు. అలాగే తన కొడుకు, కూతురు ఎవరి రాజకీయాలు వారు చేసుకుంటారని, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే వారి లక్ష్యమని, ఈ విషయంలో ఎవరూ రాజీ పడరని కూడా పేర్కొంది. జగన్ను అక్రమ కేసుల్లో జైలులో ఇరికించినప్పుడు షర్మిల పార్టీ ప్రచార బాధ్యతలను నెత్తిన వేసుకుని, 3వేల కి.మీ పాదయాత్ర చేసిందన్నారు. అందువల్ల ఈ పార్టీ నిర్మాణంలో తన కూతురు కృషి మరువలేనిదన్నారు. తన తల్లి ఇవన్నీ చెబుతున్నప్పుడు జగన్ నవ్వుతూనే ఉన్నారు. విజయమ్మ ప్రసంగం అయిపోయిన వెంటనే జగన్ లేచి తల్లిని కౌగిలించుకున్నాడు.