బీజేపీ అధికారంలోకి వస్తే స్విస్ బ్యాంకులో ఉన్న ధనాన్ని వెనక్కి తెచ్చి… ప్రతి పౌరుడి బ్యాంక్ ఖాతాలో 15 లక్షలు జమ చేస్తానని చెప్పిన ప్రధాని మోడీ మాటలు ఎలా ఉన్నా… ఇప్పుడు స్విస్ బ్యాంకులో భారతీయుల అకౌంట్లలో ధనం మూడింతలైంది. స్విస్ బ్యాంకులో భారతీయుల ఖాతాలో 2020లో ఉన్న సంఖ్యతో పోల్చుకుంటే 2021 నాటికి మూడు రెట్లు సంపద పెరిగింది. అంటే 2021 సంవత్సరాంతానికి మన దేశ పారిశ్రామికవేత్తలు, రాజకీయనాయకులు స్విస్ బ్యాంకులో దాచిన ధనం 30వేల 626 కోట్లకు చేరింది.
2020లో ఇది 20 వేల 700 కోట్లుగా ఉంది. ఇదేదో.. ఆషామాషీ లెక్క కాదు. స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంకు తన సంవత్సర నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. ప్రపంచంలో స్విస్ బ్యాంకులో ఖాతాలు ఉన్న వారిలో అగ్రస్థానంలో బ్రిటన్, అమెరికా ఉండగా భారతదేశం 44వ స్థానంలో ఉంది. బ్రిటన్, అమెరికా దేశాల తర్వాత వెస్టిండీస్, జర్మనీ, ఫ్రాన్స్, సింగపూర్, బర్మన్, ఖైమన్ ఐలాండ్స్, సైఫ్రస్, హాంకాంగ్, లగ్జంబర్గ్ లు అగ్రస్థానంలో ఉన్నాయి. భారతీయులు స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బుల్లో 2019 చివరి నుంచి 2020-21లో డిపాజిట్లు బాగా పెరిగాయని తన నివేదికలో బ్యాంక్ పేర్కొంది.
ఇదిగాక 2011, 13, 17 సంవత్సరాల్లో కూడా డిపాజిట్లు బాగా పెరిగాయని బ్యాంక్ తెలిపింది. బ్యాంకు అధికారిక నివేదికను బట్టి గత 14 ఏళ్ళల్లో స్విస్ బ్యాంకులో భారతీయుల డిపాజిట్లు 50 శాతం పెరిగాయి. దీన్నిబట్టి స్విస్ బ్యాంకు ఖాతాలలో డబ్బులు దాచి పెట్టుకోవడం, ఆపడం అనేది ఎవరి వల్ల, ఏ పాలకుల వల్ల కాదని స్పష్టమైపోయింది. ఇది కాకుండా సెక్యూరిటీలు, బాండ్లు రూపంలో మరికొన్ని వేల పెట్టుబడులు ఉన్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశ వాసుల నుంచి కూడా స్విస్ బ్యాంకుల్లో దాచుకునే వారి సంఖ్య, డబ్బులు కూడా విపరీతంగా పెరిగాయి.