ఇది మానవత్వం, మాతృత్వం.. రెండూ తలదించుకునే ఘోరం.. తల్లీ కొడుకు ఇద్దరూ కలిసి వాటిని మంటగలిపేశారు. వినడానికే భయం కలిగించే ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది. గర్భంతో ఉన్న 19 ఏళ్ల కూతురిని తల్లి.. దగ్గరుండి తమ్ముడి చేతనే తల నరికించింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లగూన్ గ్రామంలో తల్లి శోభా బాయ్, ఆమె కొడుకు ఈ కిరాతకానికి పాల్పడ్డారు. కీర్తి ఓ అబ్బాయిని ప్రేమించి పెళ్లాడింది. కులాంతర ప్రేమ కావడంతో పెళ్ళికి పెద్దలు ఒప్పుకోరని, కీర్తి ఆ యువకుడితో లేచిపోయి పెళ్లి చేసుకుంది. ఆపై యువకుడి గ్రామానికి వచ్చేసింది.
కీర్తి నెలతప్పిందని మూడవ నెల గర్భంతో ఉందని తల్లిదండ్రులకు తెలిసింది. గర్భంతో ఉన్న కూతురిని చూసి వస్తానని ఇంట్లో చెప్పి.. కొడుకుతో కలిసి బయలుదేరింది. తాను గర్భంతో ఉన్నానని తెలిసి వచ్చిన తల్లిని, తమ్ముడిని చూసి కీర్తి ఎంతో సంతోషించింది. సారె తెచ్చారని సంబరపడింది.
ఇంటికొచ్చిన తల్లికి, తమ్ముడికి టీ తయారు చేసేందుకు వంటింట్లోకి వెళ్ళింది. వెనుకనే వెళ్లిన తల్లి, తమ్ముడు ఆమెను కత్తితో నరికి చంపేశారు. తల్లి కూతురుని కిందపడవేసి, కాళ్లు పట్టుకోగా.. తమ్ముడు తల నరికేశాడు. ఆ తరువాత నరికేసిన అక్క తలను చేతిలో పట్టుకొని, అమ్మతో కలిసి సెల్ఫీ దిగాడు. పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు. కులాంతర వివాహం చేసుకొని, తమ పరువు తీసిన కారణంతోనే కూతురిని చంపేశామని తల్లి చెబుతోంది.