పెళ్ళి ముహూర్తం దగ్గర పడుతున్నా… స్నేహితులతో కలిసి సంగీత్ లో తాగి తందనాలు ఆడుతున్న పెళ్ళికొడుకుని కాదని… అదే మండపంలో వేరే వ్యక్తిని పెళ్ళి చేసుకుంది పెళ్ళికూతురు. రాజస్థాన్ లోని చురు జిల్లాలో సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు పెళ్ళి జరగాల్సి ఉంది. ముహూర్త సమయం దగ్గర పడుతున్నా.. పెళ్ళి మండపం విడిది గృహంలో స్నేహితులతో కలిసి తాగుతూ, డ్యాన్సులు చేస్తున్న పెళ్ళికొడుకు… మండపంలోకి రాలేదు.
ఎవరెన్ని విధాలుగా అడిగినా.. తర్వాత వస్తానని దాటవేస్తూ స్నేహితులతోనే కాలం గడిపేశాడు. ఆ తర్వాత రాత్రి 9 గంటల సమయంలో పెళ్ళికొడుకు వచ్చాడు. అప్పటికే విసిగిపోయిన పెళ్ళికూతురు తాను అతనిని పెళ్ళి చేసుకోనని మొండికేసింది. దీనికి తోడు మద్యం తాగిన మైకంలో ఉన్న పెళ్ళికొడుకుని కాదని, అక్కడే ఉన్న మరో యువకుడిని పెళ్ళి చేసుకోమని అడిగింది.
దీంతో ఆ యువకుడి తల్లిదండ్రులు కూడా అందుకు అంగకరించి, పెళ్ళి తంతు పూర్తి చేసేశారు. తర్వాత పోలీసులు వచ్చి పెళ్ళికొడుకుని మందలించి, పెళ్ళి ముహూర్తం దగ్గర పడుతున్నా తాగి తందనాలు ఆడుతున్న వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. ఆపై పెళ్ళికూతురు కోరుకున్న యువకుడితో దగ్గరుండి పెళ్ళి జరిపించారు.