బొచ్చు లేనివాడు నాకొద్దు..
పీటలపై నుంచి లేచిపోయిన పెళ్లికూతురు..
======================
పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోవడం ఈ రోజుల్లో మామూలైపోయింది.. అదే గతంలో పీటల మీద పెళ్లిళ్లు ఆగే సీన్లను మనం కేవలం సినిమాల్లోనే చూసేవాళ్ళం.. అయితే నేటి రోజుల్లో మాత్రం పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోవడం సర్వ సాధారణమై పోయింది. ప్రేమ వ్యవహారాలు, కట్నకానుకలు, మర్యాదల విషయంలో.. ఆఖరికి భోజనాల దగ్గర గొడవలు.. ఇలా ఏదోఒక కారణంతో పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి.
అయితే తాజాగా ఆగిపోయిన ఓ పెళ్లి విషయంలో మాత్రం ఓ విచిత్రమైన కారణం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. యూపీలోని ఉన్నవ్ ప్రాంతంలో ఓ పెళ్లి జరుగుతోంది.. పెళ్లి మండపంలో అందరూ ఆనందంగా గడుపుతున్నారు.. మేళ తాళాలు, భాజా బజంత్రీలు.. వేదమంత్రాలు అప్పటివరకూ మండపంలో హోరెత్తాయి.. ఇక మరి కొద్ది సేపట్లో ఆ మూడు ముళ్ల తంతు పూర్తవుతుందనగా పెళ్ళికొడుకు అకస్మాత్తుగా కళ్ళుతిరిగి పడిపోయాడు.. దీంతో మండపంలోని వారందరూ కంగారుపడ్డారు. పెళ్ళికొడుకు చుట్టూ చేరి.. ముఖంపై నీళ్లు చల్లి పైకి లేపారు..
అదే సమయంలో పెళ్లి కొడుకు తలపై ఉంచిన తలపాగాను, పెళ్ళికొడుకు తమ్ముడు పైకి తీశాడు.. అంతే ఒక్కసారిగా మండపంలోని వారంతా షాకయ్యారు.. ఆ సీన్ చూసిన పెళ్లికూతురికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది.. ఒక్కసారిగా పీటలపై నుంచి పైకి లేచేసింది.. మెడలోని పూలమాలను విసిరి కొట్టింది.. ఈ పెళ్లి నా కొద్దంటూ రచ్చ రచ్చ చేసింది..
పెళ్లి కూతురు ఇంతకీ పెళ్లి ఎందుకు వద్దని చెప్పిందంటే.. ఆ పెళ్ళికొడుకుకు బట్టతల.. ఆ విషయం చెప్పకుండా తనను మోసం చేశారని పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. దీంతో సీన్ లోకి ఎంటరయిన పోలీసులు.. అందరినీ స్టేషన్ కు తీసుకెళ్లి.. పంచాయితీ పెట్టారు.. పెళ్ళికొడుకు తమను మోసం చేశాడని, అమ్మాయి తరపు బంధువులందరూ కేసు పెట్టారు.. తమకు నష్టపరిహారం ఇవ్వాలని పెట్టుబట్టారు.. ఇలా ఆ పెళ్లి పీటలమీదే ఆగిపోయింది.