ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్ని వివాహం చేసుకునేందుకు ఆడిన హైడ్రామా పోలీసులకు చుక్కలు చూపించింది. తనపై గ్యాంగ్ రేప్ జరిగిందంటూ ఫేక్ కంప్లయింట్ ఇచ్చింది. అది నిజమని నమ్మిన పోలీసులు రంగంలోకి దిగారు. క్షణం తీరిక లేకుండా కేసును చేధించేందుకు పరుగులు తీశారు. తీరా అది ఫేక్ అని తేలడంతో నిర్ఘాంతపోయారు. ఈ ఘటన నాగపూర్లో జరిగింది.
అసలు వివరాల్లోకి వెళితే…
నాగ్ పూర్కు చెందిన 17 ఏళ్ళ యువతి… తనపై గ్యాంగ్ రేప్ జరిగిందంటూ కలమ్నా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మ్యూజిక్ క్లాసు నుంచి తిరిగి వస్తుండగా ఇద్దరు వ్యక్తులు తన నోట్లో గుడ్డలు కుక్కి బలవంతంగా నిర్జన ప్రదేశానికి తీసుకెళ్ళారని, ఆపై ఆ ఇద్దరూ తనను రేప్ చేశారని పేర్కొంది. ఆ తర్వాత మరో ఇద్దరు వచ్చి తనపై అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్, 40 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. వెయ్యి మంది పోలీసులను రంగంలోకి దించారు. 250 సీసీ కెమెరాలను పరిశీలించారు. బాధితురాలిని మెడికల్ ఎగ్జామినేషన్ కోసం హాస్పిటల్ కు పంపారు. నాగ్పూర్ మొత్తం గాలించారు. ఆ అమ్మాయి స్నేహితురాళ్ళను విచారించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కానీ ఆ యువతి చెప్పిన ఆనవాళ్ళేమీ పోలీసులకు అంతుచిక్కలేదు. చిన్న క్లూ కూడా దొరకలేదు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు… ఆ యువతిని గట్టిగా నిలదీశారు. అప్పుడు ఆ అమ్మాయి అసలు విషయం చెప్పడంతో పోలీసులు షాక్ కి గురయ్యారు.
ఇంతకీ ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే…
తాను ఓ అబ్బాయిని ప్రేమించానని, ఆ అబ్బాయిని పెళ్ళి చేసుకోవాలని ఉందని కానీ, ఆ అబ్బాయి పెళ్ళికి ఒప్పుకోవడం లేదని చెప్పింది. బలవంతంగానైనా పెళ్ళి చేసుకోవాలనుకున్నానని, అందుకే ఇలా కేసు పెట్టానని చెప్పింది. భయపడైనా తన బాయ్ ఫ్రెండ్ తనను పెళ్ళి చేసుకుంటానని భావించానని అందుకే ఫేక్ కేస్ పెట్టానని తెలిపింది. ఆ యువతి చెప్పిన సమాధానం విని పోలీసుల కళ్ళు బైర్లు కమ్మాయి. పోలీసులను ఏమార్చినందుకు ఆ అమ్మాయిపై కేసు నమోదు చేశారు.