పేదరికం నుంచి వచ్చిన ఓ వ్యక్తి కుబేరుడయ్యాడు. వేల కోట్లు సంపాదించాడు. వంద కోట్లతో ఎయిర్ బస్ హెలికాఫ్టర్ కొన్నాడు. ఆసియా ఖండంలోనే సొంతంగా ఈ హెలికాఫ్టర్ కొన్న తొలి వ్యక్తి ఇతను. అతని పేరు రవి పిళ్ళై. కేరళకు చెందిన ఆయన ఓ చిన్నిగ్రామంలో చిన్నప్పుడు తన తండ్రితో పాటు పొలం పనులు చేసుకునేవాడు. అయితే చిన్నప్పుడే లక్ష్యాలను ఎంచుకున్న రవి పిళ్ళై.. బాగా చదువుకుని, కొచ్చిన్ యూనివర్శిటీ నుంచి పట్టా పుచ్చుకున్నాడు.
ఆ తర్వాత స్నేహితుల వద్ద అప్పు చేసి చిట్ ఫండ్ కంపెనీనీ మొదలుపెట్టాడు. వచ్చిన కొద్దిపాటి లాభాలతో నిర్మాణరంగంలో కాలు మోపాడు. పట్టిందల్లా బంగారమైంది. ఆ తర్వాత దుబాయ్ వెళ్ళి బిజినెస్ మ్యాన్ అవతారమెత్తాడు. ఆర్పీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరుతో వేల కోట్లు సంపాదించి వేలమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఆయన వద్ద ఇప్పుడు 70 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారంటే.. ఆయన శ్రమ వెనక ఎంత కోఠోర తపస్సు ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆయన కుమార్తె వివాహానికి 40 దేశాల నుంచి 32 వేల మంది అతిధులు విచ్చేశారు. గల్ఫ్ దేశాల రాజులు, వారి కుటుంబీకులు ముఖ్యఅతిధిలుగా హాజరయ్యారు.
తాజాగా వంద కోట్లతో ఎయిర్ బస్ హెలికాఫ్టర్ కొన్నాడు. దీన్ని కొన్న తొలివ్యక్తిగా ఆసియాలోనే రికార్డు సృష్టించాడు. 7 మంది ప్యాసెంజర్లు ఈ హెలికాఫ్టర్ లో ప్రయాణించవచ్చు. ఇద్దరు పైలెట్లు ఉంటారు. కేరళలోని కోబలంలో ఆయన దీన్ని డెలివరీ తీసుకున్నారు. ఇది తన చిన్నప్పటి కల అని ఆయన చెప్పుకొచ్చారు. తన కల నెరవేరినందుకు సంతోషంగా ఉందని వినయంగా చెప్తున్నారు రవి పిళ్ళై.