మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు నదిలోకి దూసుకెళ్లగా.. 12 మంది మరణించారు. మరో 15 మందిని రక్షించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ధార్ జిల్లా ఖాల్ఘాట్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ఇందోర్ నుంచి మహారాష్ట్రలోని పుణె వెళ్తున్న బస్సు.. వంతెనపై అదుపు తప్పి నర్మదా నదిలో పడిపోయింది. సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. మిగతావారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
ఖాల్ఘాట్ వద్ద ఉన్న సంజయ్ వంతెనపైకి రాగానే బస్సు అదుపు తప్పినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో వంతెన గోడను ఢీకొని సుమారు 20 అడుగుల ఎత్తు నుంచి బస్సు నదిలోకి పడిపోయినట్లు వివరించారు. ఉదయం 10 గంటలకు ప్రమాదం జరగినట్లు తెలుస్తోంది. ప్రమాదం అనంతరం పలువురు ప్రయాణికులు నీటిలో గల్లంతు కాగా, మరికొందరు బస్సులోనే ఇరుక్కుపోయి ప్రాణాలు విడిచారు. ప్రమాద ఘటనపై మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తం మిశ్రా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.