పనామా పేపర్స్ లీక్ కేసులో ఐశ్వర్య రాయ్ కి ఈడీ నోటీసులు పంపించింది. సోమవారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయం ముందు ఫెమా కేసులో విచారణ నిమిత్తం హాజరు కావాలని అందులో కోరింది. ముందుగా సెక్షన్ 37 ఫెమా కింద 2021 నవంబర్ 9న ఐశ్వర్యరాయ్కి ఈడీ సమన్లు పంపింది. ఈ విషయంలో ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002 (PMLA) కింద మనీలాండరింగ్ కేసును నమోదు చేసింది. తన స్టేట్మెంట్ను రికార్డ్ చేయడానికి ఈ రోజు ఆఫీస్ కి రావాలని కోరింది. ఈరోజే ఐష్ ఈడీ ముందు హాజరు కావాల్సి ఉండగా, ఆమెకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె విచారణకు హాజరు కావడానికి మరో తేదీని కేటాయించాల్సిందిగా అధికారులను కోరినట్టు తెలుస్తోంది.
ఐశ్వర్యరాయ్కి ఈడీ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. పనామా పేపర్ల లీక్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసు కూడా నమోదు చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లోని హెచ్ఐయూ దీనిపై విచారణ జరుపుతోంది. నిజానికి పనామా పేపర్స్ కేసులో భారత్ నుంచి దాదాపు 500 మంది ప్రమేయం ఉంది. వీటిలో దేశ నాయకులు, సినీ నటులు, క్రీడాకారులు, వ్యాపారులు, ప్రముఖుల పేర్లు ఉన్నాయి. వీరంతా పన్ను ఎగవేతకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.