ఎవరికీ ఇబ్బంది లేకుండా తాగితే అది నేరం ఎలా అవుతుందని కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సోఫీ థామస్ ప్రశ్నించారు. మద్యం సేవించినప్పుడు అది కూడా ఒక ప్రైవేట్ స్థలంలో మద్యం తీసుకున్నప్పుడు, పబ్లిక్ కి ఎలాంటి ఇబ్బంది లేనప్పుడు పోలీసులు ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని నిలదీశారు. ప్రభుత్వమే మద్యం అమ్ముతున్నప్పుడు, మద్యం కొనుక్కుని ఇంటికి వెళ్ళి మద్యం తాగితే మీకు అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. మద్యం వాసన వచ్చినంత మాత్రాన, ఆ మద్యం తాగిన వ్యక్తి వల్ల ఏదో హాని జరుగుతుందని భావించడం తప్పు అని చెప్పారు. మద్యం తాగిన వ్యక్తిని పోలీస్ స్టేషన్ కి పిలిపించి కేసు పెట్టిన పోలీసుల వైఖరిని ఖండించారు. ఒకపక్క తామే తాగిన వ్యక్తిని పోలీస్ స్టేషన్ కి పిలిపించామని పోలీసులు చెబుతూ, మరోవైపు అతడు తాగిన మైకంలో కంట్రోల్ లేడని చెప్పడం ఏంటని, అసలు కంట్రోల్ లో లేకపోతే పోలీస్ స్టేషన్కి అతడు ఎలా వచ్చాడని ప్రశ్నించారు. తప్పుడు కేసు పెట్టినందుకు పోలీసులను మందలిస్తూ, ఆ కేసును న్యాయమూర్తి కొట్టి వేశారు.
ఓ కేసు విషయంలో ఒక అనుమానితుడిని గుర్తించేందుకు 2013లో విలేజ్ అసిస్టెంట్ అయిన సలీమ్ కుమార్ ని పోలీసులు స్టేషన్ కి పిలిపించారు. ఆ సమయంలో అతను మద్యం సేవించి ఉన్నాడు. అయినప్పటికీ సలీమ్, పోలీసులు చూపించిన అనుమానితుడిని గుర్తించి, పోలీసు రికార్డులో సంతకం కూడా చేశారు. అయితే అదే సమయంలో తాగి ఉన్నాడన్న కారణంతో పోలీసులు సలీమ్ పై కేసు పెట్టారు. అప్పటి నుంచి ఆయన ఈ కేసు విషయంలో పోరాడుతూనే ఉన్నాడు. ఎట్టకేలకు 8 ఏళ్ళ సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయమూర్తి ఈ కేసును కొట్టివేశారు.