బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ వివాదాలను అంటి పెట్టుకుని తిరుగుతుంటుంది. తనకు నచ్చని వారిపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసి చిక్కులు కొని తెచ్చుకోవడం అలవాటుగా మారింది. అదే ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సుసైడ్ సమయంలో.. బాలీవుడ్లో ఓ కోటరీ ఉందనీ, అందులో జావేద్ కూడా ఉన్నారని కంగనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆయన కంగనాపై పరువు నష్టం దావా వేశారు.
ఈ కేసు విచారణ ముంబై కోర్టులో జరుగుతోంది. చాలాకాలం నుంచి విచారణ జరుగుతున్నా, కంగనా మాత్రం ప్రత్యక్ష విచారణకు గైర్హాజరువుతూనే ఉంది. దీంతో కోర్టు ఆమెపై సీరియస్ అయ్యి చీవాట్లు పెట్టింది. కంగనా ఎంత సెలబ్రిటీ అయినా, ఓ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముద్దాయి అని గుర్తు పెట్టుకోవాలని అక్షితలు వేసింది. ప్రతిసారీ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటీషన్ దాఖలు చేయడాన్ని తప్పుబట్టింది.
ఆమెపై ఉన్న కేసు విచారణ జరుగుతుంటే, కోర్టుకు సహకరించకుండా గైర్హాజరవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు ఆమె రెండే సార్లు కోర్టుకు హాజరయ్యారని గుర్తు చేసింది. ఎంత సెలబ్రిటీ అయినా ఆమె దేనికీ అతీతం కాదని వ్యాఖ్యానించింది. వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ కంగనా చేసుకున్న విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ కోర్టు పై కీలక వ్యాఖ్యలు చేసిందది.