పదవ తరగతి పరీక్షా ఫలితాలు రాష్ట్రంలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. చాలామంది విద్యార్ధులు ఫెయిల్ అవ్వడానికే ప్రధాన కారణమైంది. రాష్ట్రవ్యాప్తంగా 71 పాఠశాలల్లో ఒక్క విద్యార్ధి కూడా పదో తరగతి పాస్ కాకపోవడం తీవ్ర ఆరోపణలకు కేంద్ర బిందువుగా మారింది. అయితే ఇది ప్రభుత్వ వైఫల్యమే అంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నినదిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ దుమ్మెత్తి పోస్తున్నాయి. విద్యార్ధులు పెద్దసంఖ్యలో ఫెయిల్ అవ్వడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని, అయితే ఆ నెపం విద్యార్ధులు, వారి తల్లిదండ్రుల మీదకి నెడుతోందని మండిపడుతున్నాయి. విద్యార్ధులు పరీక్షలు ఫెయిల్ అయితే అది ప్రభుత్వ వైఫల్యం ఎలా అవుతుంది ? ఈ విషయంలో ప్రతిపక్షాలు చేస్తోంది రాజకీయం కాదా ?
విద్యార్ధులు పరీక్షలు ఫెయిల్ అయితే.. ఈ విషయాన్ని రాజకీయాలతో ముడి పెట్టడం ఏంటి ?
ఫెయిల్ అయిన విద్యార్ధులను పాస్ చేయాలంటూ డిమాండ్ చేయడం ఏంటి ? కొందరు నాయకులు .. ఫెయిల్ అయిన విద్యార్దులను పాస్ చేయాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉంది. భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఏ రాష్ట్రంలో జరగని విధంగా.. ఏపీలో ఇలాంటి డిమాండ్ రావడం ఇదే ప్రధమం. నాయకులు డిమాండ్ చేస్తుండడంతో.. విద్యార్ధులు కూడా ఇదే డిమాండ్ను తెరపైకి తెస్తున్నారు. తమను పాస్ చేయించాలంటూ కోరుకున్నారు. తాము ఇంట్లో తలెత్తుకోలేకపోతున్నామని, వీధిలోకి వెళ్ళలేకపోతున్నామని సరికొత్త రాగం ఆలపిస్తున్నారు. పాస్ చేయించకపోతే ఆత్మహత్యలకు సైతం పాల్పడతామని హెచ్చరిస్తుండడం గమనార్హం.
పరీక్షలు నిర్వహించేది అర్హత చూపించడానికి. ఫెయిల్ అయిన వారిని పాస్ చేయించాల్సి వస్తే.. అసలు పరీక్షలు నిర్వహించడం ఎందుకు ? అందరినీ ఒకే గాడిన కట్టి పాస్ చేయించేస్తే సరిపోతుంది కదా. ఈమాత్రం దానికి పరీక్షలు నిర్వహించడం, బందోబస్తు ఏర్పాటు చేయడం, స్క్వాడ్లను నియమించడం.. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడం ఎందుకు ? అందరినీ పాస్ చేయిస్తే సరిపోతుంది కదా. ఈరోజు ఫెయిల్ అయిన పదవ తరగతి విద్యార్ధలను పాస్ చేయిస్తే.. రేపు ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్ధులు ఇదే డిమాండ్ తో ముందుకు రాకుండా ఉంటారా ? ఆ తర్వాత డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్, ఏపీపీఎస్సీ, యుపీఎస్సీ ఇలా.. ఎవరికి వారు .. తమను కూడా పాస్ చేయించాలని డిమాండ్ చేయకుండా ఉంటారా ? అసలు ఇది కరెక్టేనా ? ప్రతిపక్షాలు అధికారపక్షాన్ని తప్పుబట్టడం షరామామూలే.
ప్రభుత్వ పధకాలను విమర్శించడం సహజమే. ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడం సర్వసాధారణమే. అయితే పరీక్ష ఫలితాలను కూడా రాజకీయం చేయాలనుకోవడం, రాజకీయ కోణంలో చూడడం సరైన చర్య అని భావించాలా ? సమర్ధించాలా ? చిత్తశుద్ది ఉంటే అసలు తప్పిదం ఎక్కడ జరిగిందో ఆలోచించాలి. తప్పిదాన్ని పరిష్కరించే దిశగా సూచనలు, సలహాలు అందించాలి. అంతేగానీ ఫెయిల్ అయిన విద్యార్ధులకు మార్కులు కలిపి పాస్ చేయించండి అని డిమాండ్ చేస్తే ఎలా ? అర్ధరహితమైన డిమాండ్ కోసం పోరాటం చేస్తాం … ఉద్యమాలు చేస్తాం అంటే ఎలా ? విచక్షణతో ఆలోచన చేయాల్సిన విషయాన్ని.. రాజకీయ స్వార్ధం కోసం ఉపయోగిస్తే ఎలా ? ప్రతిపక్షాలు బాధ్యతతో వ్యవహరించాలే తప్ప.. రాజకీయ మనుగడ కోసం పాకులాడడం ఎంత వరకు సమంజసం. ఇది పార్టీల రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా… విద్యార్ధుల ఉజ్వల భవిష్యత్తు కోసం అనే కోణంలో ఆలోచిస్తే మంచిది. అవునో.. కాదో.. ప్రతి ఒక్కరూ పునరాలోచన చేయాల్సిన అత్యావశ్యకత వుంది.