వేలు, లక్షలు జీతాలు తీసుకున్నా, పాఠాలు చెప్పకుండా స్కూళ్ళు, కాలేజీలకు పంగనామాలు పెట్టే టీచర్లు.. లక్షలు జీతాలు తీసుకున్నా… ప్రభుత్వ వైద్యశాలలకు వెళ్ళకుండా, ప్రైవేటీ క్లీనిక్స్ సెంటర్లు నడుపుకుంటూ రెండు చేతులా డబ్బులు సంపాదించే డాక్టర్లు.. ఒక చేత్తో జీతం తీసుకుంటూ.. మరో చేత్తో లంచం తీసుకునే అధికారులు ఉన్న ఈ రోజుల్లో… ఓ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ తన మూడేళ్ళ జీతం 24 లక్షల రూపాయలు ప్రభుత్వానికి తిరిగి జమ చేశాడు.
బీహార్లోని ప్రభుత్వ కళాశాలలో పని చేస్తోన్న ఈ లెక్చరర్ క్లాసులో స్టూడెంట్స్ లేరు. ఆయన పాఠం చెప్పినా వినేందుకు విద్యార్దులు లేకుండా జీతం తీసుకోవడం తనకు అవమానంగా ఉందని ఆయన చెబుతున్నాడు. గత మూడేళ్ళుగా ఈ విషయంలో తాను మధన పడుతున్నానని, అందుకే తన మనశాంతి కోసం, ఆత్మసంతృప్తి కోసం.. రెండేళ్ళ 8 నెలల పాటు తీసుకున్న 23,84,000 రూపాయలను ప్రభుత్వానికి జమ చేశాడు. ఇది నిరసన కాదని, తన సంతృప్తి కోసమేనని, పని చేయకుండా జీతం తీసుకోవడం బాధగా అనిపించి, ఈ పని చేస్తున్నట్లు తెలిపారు.
హిందీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్న తనను హిందీ బోధించే, లేదా ఆ స్టూడెంట్స్ ఉండే ఏ కాలేజీకైనా ట్రాన్సఫర్ చేయమని అడిగితే .. అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. లల్లన్ కుమార్ అనే ఈయన ముజఫర్ పూర్ లోని నితీశ్వర్ కాలేజీలో హిందీ ప్రొఫెసర్. రెండేళ్ళ పాటు కరోనా వల్ల చదువులే లేకుండా పోయాయని, కాలేజీ తీసిన తర్వాత స్టూడెంట్సే లేరని ఆవేదన చెందారు. యూనివర్శిటీ వైస్ చాన్సలర్ మాత్రం లల్లన్ కుమార్ తమకు జీతం డబ్బుల చెక్ ఇచ్చారని, అయితే దానిని అంగీకరించాలా లేదా అనే విషయం ఆలోచించి చెప్తామని తెలిపారు.