కృష్ణా జిల్లాలో కాల్ మనీ వేధింపులు గతంలో బాగా ప్రచారంలోకి వచ్చాయి. వడ్డీ వ్యాపారస్తులు ఫోన్లు చేసి ఎలా బెదిరిస్తారో చాలా ఉహాదరణలు బయటపడ్డాయి. కాల్ మనీ ముఠా మహిళల్ని వేధించిందనే విషయంపై గతంలో అసెంబ్లీలో కూడా రచ్చ జరిగింది. ఇప్పుడీ కాల్ మనీ వేధింపులకు ఏకంగా ఓ ప్రభుత్వ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. ఎ.కొండూరు మండలం చీమలపాడు గ్రామానికి చెందిన గౌస్ కొండపల్లి గ్రామ వీఆర్వోగా పనిచేస్తున్నారు. వడ్డీ వ్యాపారస్తుల వద్ద కుటుంబ అవసరాల నిమిత్తం వీఆర్వో కొంత అప్పు చేశారు. వడ్డీ డబ్బులు చెల్లిస్తున్నప్పటికీ లక్షల్లో అప్పులు ఉన్నట్టు కాల్ మని మాఫియా సృష్టించింది. వారి చిత్రహింసలు తాళలేక సూసైడ్ లెటర్ వ్రాసి కొండపల్లిలోని అద్దె ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని గౌస్ బలవన్మరణానికి పాల్పడ్డారు. వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.