బీహార్ లోని బ్యాంకులు నిరుపేదల్ని సైతం కోటీశ్వరులుగామార్చేస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, వందల కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నాయి. ఇదంతా బ్యాంక్ ఉద్యోగుల పొరపాటా లేక, నిరుపేదల గ్రహపాటా అనేది అర్థం కావడంలేదు. ఎందుకంటే.. పేదల బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి కానీ, వారి చేతికి మాత్రం అవి అందిరావడంలేదు.
తాజాగా ముజఫర్ పూర్ జిల్లా కతిహార్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన రైతు రామ్ బహుదూర్ షా.. పింఛన్ ఖాతాకు సంబంధించి ఆధార్ కార్డు, వేలిముద్ర వెరిఫికేషన్ కోసం బ్యాంకుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఖాతాలో సొమ్ము ఎంత ఉందో చెక్ చేస్తే ఎంతుందో చెక్ చేయాలని అక్కడి కస్టమర్ సర్వీస్ పాయింట్ (సీఎస్పీ) అధికారిని కోరగా.. ఖాతా చెక్ చేస్తే అందులో రూ.52 కోట్లు ఉన్నట్లు చూపించింది. అంతమొత్తం ఉండడం చూసి ఒక్కసారిగా షాక్కు గురయ్యానని, ఆ మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందో తనకు తెలీదని బహుదూర్ షా చెప్పుకొచ్చాడు.
ఇదే తరహాలో పెద్ద మొత్తంలో ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్న ఉదంతాలు వెలుగుచూసినప్పుడు ఆయా ఖాతాలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. డబ్బు ఉపసంహరించుకోకుండా చూస్తున్నారు. ఈ క్రమంలో తన ఖాతాలో పడిన సొమ్ములో ఎంతో కొంత తనకిస్తే బతికేస్తానని చెప్పుకొచ్చాడు రామ్ బహుదూర్ షా. ‘‘వ్యవసాయంపై ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని ఆ ఖాతాలో కొంత సొమ్ము ఇప్పిస్తే నా జీవితం సాఫీగా సాగిపోతుంది’’ అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. ఈ అంశంపై సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినట్లు స్థానిక ఎస్సై తెలిపారు. అంతకుముందు ఇదే రాష్ట్రానికి చెందిన కటిహార్ జిల్లా బగౌరా పంచాయతీకి చెందిన ఇద్దరు విద్యార్థుల ఖాతాలో గురువారం ఏకంగా రూ.960 కోట్లు వెలుగుచూడడం ఆశ్చర్యం కలిగించింది. ఆ ఘటన మరువక ముందే ముజఫరాపూర్ జిల్లాకు చెందిన ఓ వృద్ధుడి పింఛన్ ఖాతాలో రూ.52 కోట్లు పడడం ఆశ్చర్యం కలిగించింది. బిహార్కే చెందిన ఓ వ్యక్తి ఖాతాలో ఇటీవల పొరపాటున రూ.5.5 లక్షలు జమవగా, తనకు ప్రధాని మోదీ ఇచ్చారంటూ వెనక్కి ఇచ్చేందుకు అతడు నిరాకరించడం గమనార్హం.
ఇవీ చదవండి..