ఏపీ వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. విజయసాయి రెడ్డిని కొనసాగిస్తూ.. కొత్తగా లాయర్ నిరంజన్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావులను రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారు. ముందుగా నలుగురు సీఎం జగన్తో భేటీ అయ్యారు. ఆ తర్వాత మంత్రి బొత్స వీరి పేర్లను అధికారికంగా ప్రకటించారు.
ఇద్దరు రెడ్లు.. ఇద్దరు బీసీలు..
అందరితో సంప్రదించిన తర్వాతే నలుగురి పేర్లను ఖరారు చేసినట్లు బొత్స, సజ్జల మీడియాకు తెలిపారు. విజయసాయిరెడ్డిని మరోసారి రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లు బొత్స వెల్లడించారు. అలాగే జాతీయ బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య, మరో బీసీ నాయకుడు బీద మస్తాన్ రావు, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డిలకు అవకాశం కల్పించినట్లు తెలిపారు.
నలుగురు రాజ్యసభ అభ్యర్థుల్లో ఇద్దరు బీసీలేనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రత్యక్ష పోస్టులైనా, నామినేటెడ్ పోస్టులైనా వైఎస్సార్సీపీది ఒకేటే దారి అని, జనాభా దామాషాకు తగ్గట్టుగా బడుగు, బలహీన వర్గాలకు పదవులు ఇస్తున్నామన్నారు సజ్జల. అయితే నలుగురిలో ఒకరు కూడా మహిళ లేకపోవడం విశేషం..