బిగ్ బాస్ షోస్ మీద ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. బిగ్ బాస్ షోలు అశ్లీలతకు, అసభ్యతకు నిలయాలుగా ఉన్నాయని, ఎలాంటి సెన్సార్ లేకుండా ప్రసారం అవుతున్న ఈ షోల వల్ల యువత పెడదారి పడుతోందని తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి 2019లో హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. ప్రజాప్రయోజనాల వ్యాజ్యం కింద దాఖలైన ఈ పిటీషన్ పై హైకోర్టు విచారణ ప్రారంభించింది.
న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ తర్లాడ రాజశేఖర్ రావు కూడిన ధర్మాసనం ముందు ఈ పిటీషన్ విచారణకు వచ్చింది. బిగ్ బాస్ ఒక చెత్త రియాలిటీ షో అని, దీనివల్ల యువత పెడదారి పడుతోందన్న మాట కూడా వాస్తవమేనని హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి వికృత షోల వల్ల సమాజంలో కొంతమంది దారి తప్పుతున్నారని, ఇలాంటి వాటిని ఎవరూ అడ్డుకోవడం లేదని కూడా అభిప్రాయపడింది.
ఈ పిటీషన్పై వచ్చేనెల 2వ తేదీన విచారణ చేస్తామని స్పష్టం చేసింది. న్యాయస్థానంలో మంచి వ్యాజ్యం దాఖలు చేశారని దీనిపై తప్పకుండా విచారణ మొదలు పెడతామని తెలిపింది. అనార్ధాలకు దారి తీసే ప్రోగ్రాముల వల్ల, షోల వల్ల సమాజం పెడతోవ పట్టే ప్రమాదముందని పేర్కొంది.