మూడు రాజధానుల బిల్లు రద్దు…
క్యాబినెట్ నిర్ణయం…
================
మూడు రాజధానుల నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంది. సీఆర్డీఏ బిల్లును రద్దు చేస్తూ గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అడ్వకేట్ జనరల్ ఈ ఉదయం హైకోర్టుకు తెలిపారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న వికేంద్రీకరణ బిల్లు రద్దు విషయాన్ని కూడా హైకోర్టుకు నివేదించారు. అంటే మూడు రాజధానుల నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుందా అన్న అనుమానం ఏర్పడింది. దీనిపై ముఖ్యమంత్రి జగన్ కాసేపట్లో అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు. గత కొన్ని రోజులుగా అమరావతి రాజధాని తరలింపుపై న్యాయ, పరిపాలన, శాసన రాజధానుల పేరుతో ఏర్పాటవుతున్న మూడు రాజధానులపై హైకోర్టులో రోజువారీ విచారణ జరుగుతోంది. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కూడా కేసులు నడుస్తున్నాయి. దీంతో మూడు రాజధానుల విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. విచారణ సందర్భంగా కోర్టులో చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో మూడు రాజధానుల ఏర్పాటుపై వీలు కలిగించే వికేంద్రీకరణ బిల్లును క్యాబినెట్ రద్దు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.