ఏపీ కేబినెట్ లో నెల్లూరు జిల్లాకు సంబంధించి కీలక నిర్ణయం…

    0
    224

    ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో నెల్లూరు జిల్లాకు సంబంధించి చింతలదేవి వద్ద నేషనల్‌ కామధేను బ్రీడింగ్‌ సెంటర్‌ (ఎన్‌కేబీసీ) ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
    అపురూపమైన దేశీయ గో జాతులు, గేదె జాతుల అభ్యున్నతికి నిర్మాణాత్మక కృషికి నెల్లూరు జిల్లా చింతలదేవిలో ఏర్పాటైన జాతీయ కామధేను బ్రీడింగ్‌ కేంద్రం చిరునామాగా మారుతోంది. ప్రస్తుతం 12 దేశీయ గో జాతులు, 5 దేశీ గేదె జాతుల పశువులను పరిరక్షిస్తున్నారు. అంతరించిపోతున్న పుంగనూరు వంటి గోజాతుల నుంచి మేలైన పశుజాతులను అతి తక్కువ సమయంలో పునరుత్పత్తి చేసి రైతులకు అందించడం ఈ బ్రీడింగ్‌ కేంద్రం ముఖ్య లక్ష్యం.

    నెల్లూరు జిల్లా కొండాపురం మండలం చింతలదేవిలో 2015 ఏప్రిల్‌ 4న ఈ బ్రీడింగ్ సెంటర్ ఏర్పాటైంది. దేశీ పశుసంపదను నిర్మాణాత్మకంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ఏర్పాటైన కామథేను ప్రాజెక్టుకు ఆనాటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. ఇటువంటి ప్రతిష్టాత్మక బ్రీడింగ్‌ కేంద్రం చింతలదేవితోపాటు మధ్యప్రదేశ్‌లోని ఔరంబాదాద్‌ జిల్లా హిటాచిలో మరొకటి ఉంది. కామధేను ప్రాజెక్టుకు మొదటి దశలో రూ. 25 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో పశు వైద్యశాల, పశుమేత ఉత్పత్తికేంద్రం, బయోగ్యాస్‌ ప్లాంటు, పాల ఉత్పత్తి కేంద్రం, పశువులకు షెడ్లు, రోడ్లు, నీటి సౌకర్యం కోసం బోర్లు, నీటి కుంటలు తదతర పనులు చేపట్టారు. ప్రస్తుతం ఈ పనుల్లో కొన్ని తుది దశకు చేరుకోగా మరికొన్ని పనులు జరుగుతున్నాయి. ప్రాజెక్టు విస్తరణ కోసం మరో రూ.100 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపారు.

    మేలు జాతి పశు సంపదను వృద్ధి చేసుకునే ప్రక్రియలో రైతుల దగ్గర ఇప్పటికే ఉన్న సాధారణ ఆవులు, గేదెల గర్భాలనే ఉపయోగించుకునే పద్ధతిని అనుసరిస్తుండటం విశేషం. మేలు జాతి దేశీ ఆవులు, గేదెల నుంచి సేకరించిన అండాలను, మేలుజాతి దేశీ ఆబోతుల నుంచి సేకరించిన వీర్యాన్ని అత్యాధునిక సదుపాయాలున్న ప్రయోగశాలలో ఫలదీకరణ చెందించి మేలు జాతి పిండాలను ఉత్పత్తి చేస్తారు. ఆ పిండాలను స్థానికంగా రైతుల వద్ద నున్న పశువుల గర్భంలో ప్రవేశపెట్టి మేలు జాతి దూడలను ఉత్పత్తి చేస్తారు. ప్రస్తుతం ఏపీ కేబినెట్ పూర్తి స్థాయిలో బ్రీడింగ్ కేంద్రం ఏర్పాటుకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం.

    ఇవీ చదవండి… 

    బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

    మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

    నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

    తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..