వరుసగా రెండు వాయుగుండాలు, ఆ తర్వాత అల్పపీడనం ప్రభావంతో కోస్తా జిల్లాలు వణికిపోయాయి. అయితే ఆ ప్రమాదం ఇంకా తొలగిపోలేదు. డిసెంబర్ లో మరో గండం కోస్తాకు పొంచి ఉంది. డిసెంబర్ మొదటి వారంలో బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాను నేరుగా ఆంధ్రప్రదేశ్ వైపుగా వస్తుందని వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది. ఇది బలహీనమైన తుఫాన్. అయినా కూడా దీనితో దక్షిణ కోస్తాకు ముప్పు ఉందని అంటున్నారు వాతావరణ విభాగం అధికారులు. ఈ బలహీన తుఫాను దక్షిణ కోస్తా వద్ద తీరం దాటే అవకాశం ఉంది. ఈ తుఫాను బలపడితే తీరం దాటే దిశ మారుతుంది. మచిలీపట్నం నుంచి ఒడిశా మధ్యలో తీరం దాటుతుంది.
ఇదే తుఫాను బాగా బలపడితే మాత్రం దిశను మరింతగా మార్చుకుని బంగ్లాదేశ్ వైపు వెళ్తుంది. అయితే ఈ తుఫాను బలపడినా, బలహీనంగానే ఉన్నా.. కోస్తాపై మాత్రం ప్రభావం చూపక తప్పదని అంటున్నారు. ఉత్తర తమిళనాడు లేదా దక్షిణ ఆంధ్ర నెల్లూరు లేదా ప్రకాశం జిల్లాలను తుఫాను తాకుతుందని తెలుస్తోంది. ఈ తుఫాన్ ప్రభావంతో రాయలసీమ దాకా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. గోదావరి జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయి. వర్షాలతో పాటు గాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. కృష్ణా జిల్లా నుంచి శ్రీకాకుళం దాక ఎక్కువ ప్రభావం ఉంటుందని తెలుస్తోంది. ఒకవేళ తుఫాను బలపడి బంగ్లాదేశ్ వైపు దిశ మార్చుకుంటే కోస్తాపై ప్రభావం తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.