అక్క శవం పక్కనుండగానే చెల్లెలికి పెళ్లి చేసిన వింత సంఘటన ఇది. పెళ్లి మండపంలో అక్క గుండెపోటుతో మరణించగానే.. అదే మహూర్తానికి అదే వరుడుకి, వధువు చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాతే అక్క అంత్యక్రియలు పూర్తి చేశారు.
మరో ఐదునిమిషాల్లో పెళ్లి. చుట్టాలు, అతిథులతో మండపంలో పండగ వాతావరణం నెలకొంది. బాజాభజంత్రీల నడుమ కాబోయే దంపతుల్ని ఆశీర్వదించేందుకు పెళ్లి పెద్దలు సిద్ధమయ్యారు. కానీ అంతలోనే విషాదం. పెళ్లి పందింట్లో పెళ్లికొడుకు ఒడిలోనే వధువు తనువు చాలించింది. దీంతో పెళ్లి మండపంలో పెళ్లి కుమార్తె మృతదేహాన్ని ఉంచి.. వరుడికి బాధితురాలి చెల్లెలితో వివాహం జరిపించారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఎటావా జిల్లాలో పెళ్లి కొడుకు మంజేష్ పెళ్లి కుమార్తె సురభి మెడలో తాళికట్టాల్సి ఉంది. అదే సమయంలో వధువు సురభి పెళ్లి పీటలపై కుప్పకూలింది. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు స్థానికంగా ఉండే డాక్టర్ కు సమాచారం అందించారు. పెళ్లి మండపంలోనే వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ .. బాధితురాలు గుండెపోటుతో మరణించినట్లు నిర్ధారించారు. దీంతో అదే పెళ్లి మండపంలో వరుడికి మృతురాలు చెల్లెలు నిషాతో వివాహం జరిపించారు. ఇరు కుటుంబాల అంగీకారంతోనే ఆ తంతు ముగిసింది.