ఆంధ్రప్రదేశ్ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై వైసీపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ను రద్దు చేసింది. వెంటనే ఆయనను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. కోర్టు తీర్పుపై వెంకటేశ్వరరావు స్పందిస్తూ… న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని విమర్శించారు. ఏ బావ కళ్ళల్లో ఆనందం కోసం ఉన్నతాధికారులు ఇలా చేశారంటూ నిలదీశారు. ఏ సైకో కోసం, ఏ శాడిస్ట్ కోసం ఇదంతా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికిగానీ, అధికారులకుగానీ నిబంధనలు తెలియవా అంటూ మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో కేసు ఓడిపోవడాన్ని ఎవరు బాధ్యతగా స్వీకరిస్తారంటూ ప్రశ్నించారు.
న్యాయవాదులకు ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు. తన సస్పెన్షన్ ను ప్రశ్నించడమే తప్పా అంటూ నిలదీశారు. తనపై కుట్ర చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టనని, బాద్యులపై చర్యలు తీసుకునే వరకు ఊరుకోనని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు నిఘా పరికరాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ విధించింది. అయితే తనపై సస్పెన్షన్ విధించి రెండేళ్లు పూర్తి అవుతున్నా…ఇంకా ఎత్తివేయలేదని, తనను సర్వీసులోకి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలంటూ వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈరోజు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది.