ఏపీ, తెలంగాణకు పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటూ ఆనాడు విభజన చట్టంలో పేర్కొన్నారు. అయితే పదేళ్లు పూర్తికాకముందే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చేశారు. ఉద్యోగులను, వివిధ శాఖల కార్యాలయాలను తరలించారు. అయితే లెక్కప్రకారం హైదరాబాద్ ఇంకా ఏపీకి రాజధానే అనేవారు కూడా ఉన్నారు.
అక్కడ కట్ చేస్తే.. వ్యవహారం ఇటీవల ఏపీ, తెలంగాణ సరిహద్దులు మూసివేసిన సమయంలో మరోసారి రచ్చకెక్కింది. కరోనా సెకండ్ వేవ్ టైంలో వైద్యం కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వెళ్తున్న రోగుల్ని, వారి బంధువుల్ని అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. ఇతర రాష్ట్రాలవారు తెలంగాణకు రావొద్దంటూ తిప్పిపంపించారు. ఈ నేపథ్యంలో ఏపీ వాసుల్ని ఉమ్మడి రాజధానికి ఎందుకు రావొద్దంటున్నారని కొంతమంది లాజిక్ తీశారు.
ఈ క్రమంలో ఏపీకి చెందిన న్యాయ విద్యార్థి క్రాంతి కుమార్ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. హైదరాబాద్ ఇంకా ఉమ్మడి రాజధానిగా ఉంది కాబట్టి.. ఏపీ ప్రజలను తెలంగాణకు రాకుండా ఆపడం.. నోటిఫికేషన్ విడుదల చేయడం చట్ట విరుద్ధమంటూ ఆయన పేర్కొన్నారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ను సవాలు చేస్తూ ఆయన పిటిషన్ ను దాఖలు చేశారు.
అయితే ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఏపీ రాజధాని హైదరాబాద్ కాదంటూ స్పష్టం చేసింది. మీరింకా సెక్షన్ 5 దగ్గరే ఆగిపోయారంటూ పిటిషనర్ను ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది.
జాతీయ విపత్తు చట్టం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ జారీ చేసిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.