ఇటీవల తెలంగాణలో తహశీల్దార్ పై డీజిల్ పోసి కొంతమంది హడావిడి చేయగా.. ఆ సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇప్పుడు అలాంటిదే మరో ఘటన జరిగింది. ఈసారి తహశీల్దార్ ప్లేస్ లోకి అటవీ అధికారులు రాగా, డీజిల్ బదులు, పెట్రోలు వాడారు గిరిజనులు.
నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చెంచులు సాగు చేసుకుంటున్న అటవీ భూములను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన అటవీ అధికారులపై గిరిజన రైతులు దాడి చేసి పెట్రోల్ పోశారు. కొన్నేళ్లుగా మాచారం పరిధిలోని అటవీ భూములను చెంచులు సాగు చేసుకుంటున్నారు. ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టేందుకు అటవీ శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించి ఇప్పటికే పలుమార్లు రైతులతో మాట్లాడి భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు.
శుక్రవారం మొక్కలు నాటేందుకు వచ్చిన అటవీ అధికారులను చెంచులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో చెంచులకు, అధికారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అక్కడే ఉన్న కొంత మంది రైతులు వారి వెంట తెచ్చుకున్న పెట్రోల్ను అధికారులపై పోశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడటంతో వారు శాంతించారు.