మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ మృతి చెందారు. సుకుమా-బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో ఆర్కే అనారోగ్యంతో చనిపోయారు. ఆయనను చంపినా, ఆయనను పట్టించినా.. ప్రభుత్వం ప్రకటించిన రివార్డ్ ఎంతో తెలుసా ? గత 25 ఏళ్ళుగా ఆ రివార్డ్ ఎప్పటికప్పుడు పెరుగుతూ వచ్చింది.
ఆయనను పట్టించినా, అరెస్టుకు సహకరించినా .. ఆయన తల మీద అక్షరాలా రూ.97 లక్షలు నజరానా ఉంది. ఆర్కేగా దేశం మొత్తం పేరున్న రామకృష్ణ అసలు పేరు అక్కిరాజు వేణుగోపాల్. రామకృష్ణ చనిపోయిన తర్వాత ఆయన మృతదేహాన్ని అడవుల్లోని మావోయిస్ట్ దళాల మధ్య ఘనంగా ఖననం చేసి నివాళులు అర్పించారు. ఆయన మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాతనే .. మావో పార్టీ, ఆయన మరణవార్తను అధికారికంగా ప్రకటించింది.
గతంలో కూడా చాలామంది మావోయిస్టులు అనారోగ్యంతో మృతి చెందినప్పుడు పార్టీ ఇలాగే అంత్యక్రియలు చేసింది. శవాన్ని బయటకు కూడా ఇవ్వరు. మృతి సమాచారాన్ని కూడా అంత్యక్రియలు పూర్తయిన తర్వాతే ఇస్తుంది. ఇప్పుడు ఆర్కే ఎక్కడ చనిపోయారన్న విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దక్షిణ బీజాపూర్ కీకారణ్యంలో చనిపోయి ఉంటారని, అక్కడే అంత్యక్రియలు కూడా జరిగి ఉంటాయని నిర్ధారణకు వచ్చారు. ఆర్కే కోసం ఆంధ్రా, చత్తీస్ ఘడ్, ఒరిస్సా పోలీసులు 30 ఏళ్ళుగా జల్లెడ పట్టి గాలించినా పట్టుకోలేకపోయారు. 2018లోనే ఆయన పెద్ద ఎన్ కౌంటర్ నుంచి బయటపడ్డారు. అప్పుడే ఆయన చనిపోయాడని పెద్ద ఎత్తున పుకార్లు వచ్చాయి. 2018లో ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో 24 మంది మావోలు చనిపోయినా, ఆర్కే మాత్రం బయటపడ్డారు. ఆయన చుట్టూ ఉన్న భద్రతావలయం పోలీసుల దాడులను తిప్పికొట్టే వ్యూహం అంత పటిష్టంగా ఉంటుంది.
గత రెండేళ్ళ నుంచి కూడా రామకృష్ణ ఎన్ కౌంటర్ లో చనిపోయాడని, కరోనాతో చనిపోయాడని రకరకాల పుకార్లు వచ్చాయి. ఆయనను చివరిసారిగా పోలీసులు చూసింది 2004లో వైఎస్.రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నక్సల్స్ తో శాంతిచర్చలకు పిలిచినప్పుడే. ఈ శాంతి చర్చలు విఫలమైన తర్వాత ఆర్కేను చంపాలని పోలీసులు కూడా గాలించారు. ఒకదశలో ఆయన శాంతి చర్చలు విఫలమైన తర్వాత నల్లమల అడవుల్లో తలదాచుకున్నారన్న సమాచారంతో నల్లమల అడవులను కొండలను జల్లెడ పట్టి గాలించారు. ఆ సమయంలోనే ఆయన అక్కడి నుంచి నేర్పుగా తప్పించుకుని పారిపోయాడారు. అప్పుడే ఆయన ఏఒబీ కార్యదర్శిగా నియమించబడ్డాడు. ఆయుధాల్లో శిక్షణ ఇవ్వం, మందుపాతరలు పేల్చడంలో సిద్ధహస్తుడని చెబుతారు.