షుగర్ వ్యధి అంటేనే భయపడిపోయే కాలమిది. ఈ వ్యాధిపై నిజాల కంటే భయాలే ఎక్కువగా పేషంట్లని కుంగదీస్తుంటాయి. కొంతమంది డాక్టర్లు ఇలాంటి పేషంట్లను మరీ ఎక్కువగా భయపెట్టేస్తుంటారు. అయితే టైప్2 డయాబెటీస్ రోగుల విషయంలో జీవనశైలిని మార్చుకోవడం ద్వారా ప్రతి 20 మందిలో ఒకరు షుగర్ వ్యాధి నుంచి శాశ్వతంగా బయట పడవచ్చునని ఒక అధ్యయనంలో తేలింది. లక్ష 62వేల మందిపై శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో ఈ నిజం బయటపడింది. షుగర్ వ్యాధి నయం కాదని అనుకుంటున్న తరుణంలో జీవనశైలిలో మార్పుల ద్వారా ఈ వ్యాధిని శాశ్వతంగా నయం చేసుకోవచ్చునని నిరూపించారు.
ప్రతి 20 మందిలో ఒకరికి మందులు లేకుండా జీవనశైలిలో మార్పుల ద్వారా షుగర్ వ్యాధి నుంచి శాశ్వతంగా బయటకి రావొచ్చని గమనించారు. ఆకలిని చంపేందుకు, బేరియాట్రిక్ సర్జరీ, అతితక్కువ క్యాలరీల ఆహారం, ఇలాంటి వాటితో షుగర్ పేషంట్లు తమను తామే శిక్షించుకోకుండా జీవనశైలిలో మార్పులను చేసుకుని ఈ వ్యాధికి దూరం కావొచ్చని స్పష్టం చేశారు.
ఊబకాయంతో సంబంధం ఉన్న టైప్ 2 డయాబెటీస్ లో డయాబెటిక్ అల్సర్లు, కంటి చూపు మందగించడం, డయాబెటిక్ నిరోపతి ఇలాంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు జీవనశైలిలో మార్పుల ద్వారా బరువు తగ్గించుకుని ఆహారం తీసుకునే క్రమాన్ని నియమానుసారంగా పెట్టుకుని, ఒత్తిడికి కార్బోరేట్లు ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా, పరిమితంగా వ్యాయామం ద్వారా టైప్ 2 డయాబెటీస్ 20 మందిలో ఒకరికి దూరమైందని చెప్పారు. 45 నుంచి 54 ఏళ్ళలోపు ఉన్న వాళ్ళలో ఈ ప్రక్రియ చాలాబాగా పని చేసిందని తెలిపారు. జీవనశైలిలో మార్పుల ద్వారా చక్కెర వ్యాధిని దూరం చేసుకోవాలనుకున్నా, నియంత్రణ చేసుకోవాలనుకున్నా, ప్రతి మూడు నెలలకు ఒకసారి టెస్టులు చేయించుకోవాలని సలహా ఇచ్చారు.