ప్రపంచవ్యాప్తంగా వింటేజ్ కార్లకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోట్లు పెట్టి మరీ కొనుగోలు చేస్తుంటారు. ధర నచ్చితే అమ్మేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి కార్లలో ఒకటి ట్రావెన్ కోర్ ప్యాలెస్ లోని మెర్సిడెస్ బెంజ్ 180 T కారు. ఈ వింటేజ్ కారుకి పెద్ద చరిత్రే ఉంది. అప్పటి ట్రావెన్ కోర్ మహారాజు తిరునాల్ మార్తాండ వర్మ 1945లో జర్మనీ దేశంలో ఈ కారును కొన్నారు. 12 వేల రూపాయలు వెచ్చించి ఈ కారును కొనుగోలు చేసి కేరళ తీసుకొచ్చారు. ఎన్ని కార్లు ఉన్నప్పటికీ, 85 ఏళ్ళ వయసు వరకు ఆయన ఆ కారులోనే తిరిగారు. మార్తాండవర్మ తదనంతరం వారసులు కూడా ఆ కారులోనే తిరిగిన సందర్భాలున్నాయి.
ఇప్పటివరకు ఈ మెర్సిడెస్ బెంజ్ 180 T కారు 24 లక్షల కి.మీ తిరిగింది. ఈ వింటేజ్ కారును కొనుగోలు చేసేందుకు అంతర్జాతీయంగా ఎంతోమంది ముందుకొచ్చారు. అయినప్పటికీ ట్రావెన్ కోర్ సంస్థానాధీసులు అందుకు అంగీకరించలేదు. ప్రస్తుతం ట్రావెన్ కోర్ మహారాజు పద్మనాభవర్మ ఆధీనంలో ఈ కారు ఉంది. ఆమధ్య బెంజ్ కంపెనీ ప్రతినిధులు.. ఆ వింటేజ్ కారును తమకు ఇవ్వాల్సిందిగా కోరి.. ఎక్సేంజ్ ఆఫర్ కింద రెండు అత్యాధునిక బెంజ్ కార్లు ఇస్తామని ప్రపోజల్ పెట్టారు. అందుకు కూడా పద్మనాభవర్మ ఆ ఆఫర్ ను తిరస్కరించారు. ఇలా ఎంతోమంది ఆ కారును కొనాలని పోటీ పడ్డా… ససేమిరా అన్నారు ఆ సంస్థానాధీసులు
ఇటీవల దుబాయ్ వెళ్ళిన పద్మనాభవర్మ… లులూ గ్రూప్ చైర్మన్ యూసఫ్ ఆలీ ఇచ్చిన విడిదిలో గడిపారు. యూసఫ్ ఆలీ కేరళకు చెందిన వ్యక్తి. పారిశ్రామిక వేత్త అయిన ఆయన.. దుబాయ్ లో లులూ గ్రూప్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన కేరళ వచ్చినప్పుడు ట్రావెన్ కోర్ ప్యాలెస్ లో విడిది చేశారు. పద్మనాభవర్మ ఆయనకు ఆతిధ్యమిచ్చారు. ఈ క్రమంలో మెర్సిడెస్ బెంజ్ 180 T కారు.. యూసఫ్ ఆలీ దృష్టిలో పడింది. ఈ కారును అమ్మాలనుకుంటే, ఇవ్వాలనుకుంటే తనకు ఇవ్వాలని పద్మనాభవర్మను యూసఫ్ ఆలీ విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో యూసఫ్ కు ఆ వింటేజ్ కారును ఇవ్వాలని పద్మనాభవర్మ నిర్ణయం తీసుకున్నారు. అది కూడా బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.