గృహ హింస చట్టంకింద భర్త తరపు బంధువులను వేధించడం ఇటీవల కాలంలో ఎక్కువై పోయిందని ఇలాంటి కేసుల విషయంలో తొందరపడి భర్త బంధువులను అరెస్ట్ చేయకుండా విచారణ జరపాలని, నిర్దిష్టమైన ఆధారాలు ఉంటేనే, కేసులు నమోదు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక కేసుకి సంబంధించి, సుప్రీంకోర్టు గృహ హింస చట్టం ఐపీసీలోని 498-ఎ దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేసింది. భార్యలు భర్తలతో తగాదా పడి వరకట్న వేధింపుల కేసులు పెట్టి, ఆ కేసుల్లో భర్తనే కాకుండా, భర్త తరపు బంధువుల్ని కూడా నేరస్తులుగా చూపాలని అనుకోవడం మంచిపద్ధతి కాదని, ఇలాంటి చర్యల వల్ల, చట్టం అభాసుపాలయ్యే అవకాశం ఉందని చెప్పింది.
భార్యా భర్తల మధ్య జరిగే తగాదాల్లో ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండా, అత్తమామల్ని కానీ, ఆడపడుచుల్ని కానీ, మరుదుల్ని కానీ, లేదా ఇతర భర్త తరపు బంధువుల్ని కానీ వేధించొద్దని విచారణ లేకుండా కేసులు కూడా నమోదు చేయవద్దని కూడా స్పష్టం చేసింది. ఇటీవల కాలంలో వ్యక్తిగత ద్వేషాలకు, 498-ఎ సెక్షన్ ఉపయోగించుకుంటూ దుర్వినియోగ పరుస్తున్నారనే విషయంలో అనుమానం లేదని, అందువల్ల తప్పుడు కేసుల విషయంలో విచారణ అధికారులు సంయమనం పాటించాలని, జాగ్రత్తగా వ్యవహరించాలని, లేని పక్షంలో మంచి ఉద్దేశంతో పెట్టిన ఈ చట్టం దుర్వినియోగం అవుతుందని పేర్కొంది.