పెళ్లిళ్ల పేరుతో లక్షలు, కోట్లు ఖర్చు పెట్టే సంపన్న కుటుంబాలకు ఈ యువతి ఆదర్శం, మార్గదర్శకం అయితే బాగుంటుంది. రాజస్థాన్ లోని బర్మర్ లో తండ్రి కిషోర్ సింగ్ తన కూతురు అంజలి కన్వర్ పెళ్లికోసం 75లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలని భావించారు. ఈ విషయం తెలుసుకున్న ఆ అమ్మాయి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తే ఎవరికీ ఉపయోగం ఉండదని, తనకి అసలే ఇష్టం లేదని చెప్పింది.
ఇలాంటి పెళ్లిళ్ల వల్ల డబ్బులు వృథా కావడం తప్ప ఎవరి జీవితాలు బాగుపడవని, అందువల్ల తన పెళ్లికోసం ఖర్చు పెట్టాలనుకుంటున్న 75లక్షల రూపాయలను తాను చదువుకున్న కాలేజీలో హాస్టల్ బిల్డింగ్ కోసం ఖర్చు పెట్టాలని కోరింది. ఈ హాస్టల్ లో చాలామంది పేద పిల్లలు కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతుంటారని, అందువల్ల ఈ మంచి పని చేయాలని తండ్రిని కోరింది. కూతురి కోరికను తండ్రి వెంటనే నెరవేర్చాడు. పెళ్లి కొడుకు తరపువారు కూడా పెళ్లి కూతురు కోరికను మన్నించాలని చెప్పారు. ఇలా చేస్తే ఆడపిల్లల చదువుకి ఉపయోగపడుతుందని వసతులు బాగుంటే ఆడపిల్లలు ఇంకా బాగా చదువుకుంటారన్నది అంజలి భావన.