మెడికల్ పాలసీలకు సంబంధించి చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు ఏదో ఒక సాకుతో క్లెయిమ్ మొత్తాన్ని తగ్గించడమో, తిరస్కరించడమో… ఆ తర్వాత కోర్టు గడపలు ఎక్కడమో జరుగుతూనే ఉన్నాయి. మెడికల్ పాలసీ చేయించుకునేటప్పుడు చెప్పే మాటలకు, క్లెయిమ్ తీసుకునేటప్పుడు పడే బాధలకు చాలా తేడా ఉంది. రకరకాల కుంటి సాకులతో ఇబ్బంది పెడుతున్నాయి. ఇలాంటి వాటిలో ఒక ముఖ్యమైన అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఓ సంచలనమైన తీర్పు ఇచ్చింది.
ఒక్కసారి పాలసీ చేసిన తర్వాత.. పాలసీ చేయకు ముందు నుంచి ఉన్న ఆరోగ్య సమస్యల క్లెయిమ్ తిరస్కరించే వీలు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక వ్యక్తి పాలసీ తీసుకునేటప్పుడు తనకు తెలిసిన అన్ని సమస్యల గురించి, వ్యాధుల గురించి భీమా సంస్థకు తెలియచేయాల్సిన బాధ్యత ఉంటుంది. అయితే ఆ వ్యక్తి తనకు తెలిసిన జబ్బులను మాత్రమే చెప్పగలడు. తెలియకుండా తనలో ఏ జబ్బు ఉందో అతనికి తెలియదు. ఒకసారి పాలసీ జారీ చేయడం పూర్తయిన తర్వాత, ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైనా జబ్బుకు క్లెయిమ్ చేస్తే.. ఆ జబ్బు పాలసీ చేయకముందు ఉన్నది కాబట్టి తాము క్లెయిమ్ చెల్లించలేమని చెప్పే హక్కు ఇన్సూరెన్స్ కంపెనీకి లేదని పేర్కొంది. ఆ మొత్తం క్లెయిమ్ చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.
మన్మోహన్ నందా అనే వ్యక్తికి సంబంధించిన కేసులో సుప్రీం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. నందా అమెరికాకు వెళుతూ మెడిక్లయిమ్ పాలసీ తీసుకున్నాడు. అమెరికాలో విమానం దిగిన తర్వాత హార్ట్ ఎటాక్ వచ్చింది. అక్కడ ఆయనకు స్టంట్స్ వేశారు. నందా అక్కడ స్టంట్స్ అయిన ఖర్చుకు ఇన్సూరెన్స్ కి క్లెయిమ్ చేసుకున్నాడు. నందాకు అప్పటికే కొలస్ట్రాల్ ఎక్కువగా ఉందని, షుగర్ తో బాధ పడుతున్నాడని, పాలసీ కొనుగోలు చేసే సమయంలో ఈ విషయాలేవీ తమకు చెప్పలేదని, అందువల్ల ఇన్సూరెన్స్ క్లయిమ్ నిరాకరిస్తున్నామని కంపెనీ తెలిపింది. వినియోగదారుల కమిషన్ లోనూ నందాకు వ్యతిరేకంగానే తీర్పు వచ్చింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో సుప్రీం తీర్పు చెబుతూ, అకస్మాత్తుగా అనారోగ్యం వచ్చి ఆస్పత్రిలో చేరాల్సి వస్తుందనే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారని, ఆయనకు గుండెనొప్పి వస్తుందని ఎలా తెలుస్తుందని, అందువల్ల ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తం నందాకు ఇవ్వాలని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీవీ నాగరత్న తీర్పు ఇచ్చారు.