గురువు దైవంతో సమానం అంటారు. అలాంటి గురువు మృత్యువు ఒడిలోకి వెళ్ళబోతోంది. అయినా చివరిక్షణంలో కూడా తన విద్యార్ధులను చూసుకోవాలన్నది ఆ టీచర్ తపన. కేరళలోని కాసరగుడి వాసి అయిన ఆ టీచర్ పేరు మాధవి. లెక్కల టీచర్. 9వ తరగతి పిల్లలకు ఆన్ లైన్ క్లాసులు చెబుతోంది. ముందురోజు కూడా ఆమె క్లాసులు చెప్పి హోంవర్క్ ఇచ్చింది. అయితే ఉన్నట్టుండి ఆమెకు మృత్యుఘంటికలు మోగాయి. చావు సమీపంలోకి వస్తోందన్న విషయం అర్ధమైపోయింది. కొన్ని నిమిషాల్లో చనిపోతాను అని తెలిసిపోయింది. ఆమెకు ఆ క్షణంలో దేవుడు గుర్తు రాలేదు. పిల్లలు కూడా గుర్తుకు రాలేదు. కేవలం తన స్టూడెంట్స్ మాత్రమే గుర్తొచ్చారు.
తన విద్యార్ధులను చూడాలన్న ఆశతో వీడియో కాల్ చేసి, అందరినీ ఆన్ లైన్ లోకి రావాలని కోరింది. రేపటి రోజును చూస్తానో లేదో తెలియదు, తెల్లారేసరికి ఉంటానో, ఉండనో కూడా తెలియదు, ఒక్కసారి మీ ఫోన్ కెమెరాలు ఆన్ చేయండి అంటూ చెప్పింది. అంతే క్షణాల్లో విద్యార్ధులంతా ఆన్ లైన్ లో ప్రత్యక్షమయ్యారు. ఇక ఆ టీచర్, తన విద్యార్ధులందరినీ కన్నులారా చూసింది. నవ్వుతూ ప్రేమగా చూస్తూ కన్నుమూసింది. కళ్ళ ముందే టీచర్ చనిపోతే ఆ విద్యార్ధులంతా ఘొల్లుమన్నారు. భోరున విలపించారు. ఆ పిల్లలను ఓదార్చడం తల్లిదండ్రులకు వీలు కాలేదు. అంత ప్రేమను ఆ పిల్లలు తమ టీచర్ పై పెట్టుకున్నారు. ఇక మాధవి టీచర్ కూడా తన విద్యార్ధుల రూపాలను కళ్ళల్లో దాచుకుని తనువు చాలించారు. ఆమె భర్త రెండేళ్ళ క్రితం కన్నుమూశారు.