హైదరాబాద్ లో ప్రమాదానికి గురైన హీరో సాయిధరమ్ తేజ్ కోలుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు అపోలో హాస్పిటల్ హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేసింది. స్పోర్ట్స్ బైక్ పై వెళ్తూ ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్ పై ఇప్పటికే వందల కొద్దీ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. స్పోర్ట్స్ బైక్ పై అతివేగంగా వెళ్లడం వలనే ప్రమాదం జరిగిందంటూ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్ ను చూసేందుకు మెగా స్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తో పాటూ ఇండస్ట్రీలోని చాలా మంది నటీనటులు కూడా అపోలోకు చేరుకొని పరామర్శించారు. సాయి ధరమ్ తేజ్ కోలుకోవాలని కూడా ఆకాంక్షించారు.
సాయి ధరమ్ తేజ్ పట్ల చాలా మంది అభిమానులు కూడా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. సాయికి ఏమీ కాకూడదని కోరుకుంటున్నారు. ఎందుకంటే సాయి ధరమ్ తేజ్ మంచి మనసే అందుకు కారణంగా తెలుస్తోంది. సరిగ్గా రెండేళ్ల క్రితం హైదరాబాద్ లో కారులో వెళ్తున్న సాయి ధరమ్ తేజ్ కళ్లెదుటే ఓ ప్రమాదం జరిగింది. స్పోర్ట్స్ బైక్ పై నుంచి కిందపడి, గాయపడిన వ్యక్తిని, సాయి కారులో నుంచి చూశాడు. మామూలుగా అయితే ఇలా కళ్లెదుట ప్రమాదాలు జరిగితే, ఎవరైనా సరే.. మనకెందుకులే అని చూసీ చూడనట్టుగా వెళ్ళిపోతారు. కానీ సాయి మాత్రం అందరిలా అలా వెళ్లిపోలేదు.. వెంటనే తన కారు దిగి.. గాయపడిన వ్యక్తికి సాయం చేశాడు. స్వయంగా ఎత్తుకొని తన కారులో తీసుకెళ్లి.. ఆసుపత్రిలో చేర్చాడు. ఇదీ సాయి ధరమ్ తేజ్ పెద్దమనసు.. అందుకే సాయి కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు..
ఇవీ చదవండి..