కోవిడ్-19 సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. కోవిడ్-19 కారణంగా 2020లో సగటు జీవిత కాలాన్ని రెండేళ్లకు తగ్గించిందని బీఎంసీ పబ్లిక్ హెల్త్ నివేదికలో పేర్కొంది. ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పాపులర్ సైన్సెస్, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ.. ఈ విషయంపై జరిపిన పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. భారత దేశంలో గతేడాది సగటు జీవిత కాల ప్రమాణం రెండేళ్లు తగ్గింది. అధిక సంఖ్యలో మరణాల వల్ల ఈ సగటు వయసు తగ్గింది. కోవిడ్ కారణంగా మరణాల్లో 35నుంచి 79 ఏళ్ల వయసులోపు వారు ఎక్కువ ఉన్నారు. వీరిలో మహిళలకంటే పురుషులే ఎక్కువ ఉన్నారు.
మహిళల్లో సహజమైన శరీరాకృతి వారిలో హార్మోన్ల ప్రభావం వాటినుంచి రక్షణ, తదితర కారణాల వల్ల మహిళలు ఎక్కువమంది ఈ వ్యాధిబారిన పడలేదని, ఒకవేళ పడినా మరణాల శాతం అతి తక్కువగా ఉందని పేర్కొన్నారు. ఇది కాకుండా జననాల సంఖ్య కూడా గతంలోకంటే 25శాతం తగ్గిందని కోవిడ్ కారణంగా గర్భందాల్చేందుకు మహిళలు అనాసక్తి చూపేవారని కూడా ఈ నివేదికలో తేల్చారు.
కోవిడ్ కాలంలో సంభవించిన మరణాల సంఖ్యను, భారత దేశంలో సగటు వయసుకి ప్రామాణికంగా తీసుకునే వీలు లేనప్పటికీ కోవిడ్ కలిగించిన ఉపద్రవాన్ని, భయోత్పాతాన్ని దీంతో పోల్చి చూడవచ్చని చెప్పారు. కోవిడ్ కారణంగా మానసిక ఆరోగ్యంలో కూడా విపరీతమైన మార్పులు సంభవించాయని తెలిపారు. కోవిడ్ సృష్టించిన విలయం ఒకసారి కోవిడ్ సోకినవారికి మరో మూడేళ్ల వరకు ఆ భయం పోయే అవకాశం లేదని కూడా చెప్పారు.