ఓ పియానో కళాకారుడి మన్మధ లీలలు పోలీసులకే పిచ్చెక్కించింది. నల్గొండ జిల్లాలో ఓ చర్చిలో పియానో వాయించే విలియమ్స్ అనే వ్యక్తి,.. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 19 మందితో సంబందం పెట్టుకున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరికి పెళ్ళి కబుర్లు చెప్పాడు. కొంతమందికైతే నెత్తిన నీళ్ళు చల్లి పెళ్ళి చేసుసుకున్నాంటూ కాపురం కూడా పెట్టేశాడు. ఇలా మాయమాటలు చెప్పిన ఇతగాడి మోసాలను మోసపోయిన ఓ భార్య బయట పెట్టింది. నల్గొండలో ఉండే విలియమ్స్, తనూజ అనే యువతితో ప్రేమలో పడ్డాడు. కొంతకాలం సహజీవనం చేశాడు. తనూజ ఒత్తిడి మేరకు పెళ్ళి చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత మరో అమ్మాయిని లోబరుచుకున్నాడు. ఈ విషయం తెలిసిన తనూజ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో ఒకరి వెనక మరొకరు విలియమ్స్ పై ఫిర్యాదులు చేశారు. కొందరు తమను విలియమ్స్ పెళ్ళి చేసుకున్నాడని, మరికొందరు పెళ్ళి చేసుకుంటానని నమ్మించి సంబంధం పెట్టుకున్నాడని పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. విలియమ్స్ పియానో వాయించడంలో మహా దిట్ట. ఆ కళలో తన నైపుణ్యాన్ని అడ్డం పెట్టుకుని మహిళలను బుట్టలో వేసుకున్నాడు. మరికొందరు పెళ్ళయిన మహిళలు కూడా వీడి వలలో పడ్డారు. విలియమ్స్ ను పోలీసులు అరెస్టు చేసినప్పుడు తనకు గుండెనొప్పిగా ఉందంటూ కిందపడిపోయాడు. ఆస్పత్రిలో చేర్చించి డాక్టర్ల సలహా మేరకు అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెప్పారు. ఇతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.