ఖాతాదారుల సేవల్లో నిర్లక్ష్యం చేస్తే పేటీఎం కూడా జరిమానా చెల్లించాల్సిందే. హైదరాబాద్ కి చెందిన ఓ వినియోగదారుడు పేటీఎం నిర్లక్ష్యం మీద వినియోగదారుల ఫోరమ్ లో కేసు దాఖలు చేస్తే.. తప్పు జరిగిందని ఫోరమ్ నిర్ధారించి, పేటీఎం సంస్థకు జరిమానా విధించింది. మొత్తం 25వేల రూపాయల జరిమానా వేసింది. వివేక్ అనే వ్యక్తి ఒక వస్తువు కొనుగోలుకు సంబంధించి పేటీఎం ద్వారా 6 వేల నగదు బదిలీ చేశాడు. ఆ వస్తువు నచ్చకపోవడంతో, తిరిగి వస్తువును రిటర్న్ చేసి డబ్బులు వాపస్ పంపాలని కోరాడు. అయితే ఆ డబ్బులు పేటీఎం నుంచి బ్యాంకుకు బదిలీ కాలేదు. పేటీఎంకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో, అతను కన్జ్యూమర్ ఫోరమ్ కి ఫిర్యాదు చేశాడు. బ్యాంకుకు మనీ ట్రాన్సఫర్ చేయకపోవడం, ఖాతాదారుడికి సరైన సమాధానం చెప్పనందుకు, పేటీఎంకు 25వేల జరిమానా విధించారు.