అలా ఆనందం పొందలేని జీవితం నాది..
సీఎం జగన్ కు ముద్రగడ లేఖ..
టీడీపీ హయాంలో కాపు రిజర్వేషన్లకోసం జరిగిన నిరసనలపై పోలీసులు కేసులు పెట్టారు. ఆ కేసుల్ని ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంపై కూడా ఈ కేసులున్నాయి. కేసుల ఉపసంహరణపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్ కి కృతజ్ఞతతో లేఖ రాశారు. అయితే తాను నేరుగా కలవలేనని నిస్సహాయత వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నవారిని కలిస్తే తాను ఉద్యమాన్ని అమ్మేసుకుంటున్నానని, పదవులకోసం పాకులాడుతున్నాననే అపవాదులు మోయాల్సి ఉంటుందని వాపోయారు. గతంలో చంద్రబాబు కాపులకోసం బీసీ-ఎఫ్ ఫైలుని కేంద్రానికి పంపించినప్పుడు కూడా నేరుగా కలవలేకపోయానని గుర్తు చేసుకున్నారు.
తమకి మేలు చేసినవారిని నేరుగా కలసి ధన్యవాదాలు తెలుపుకోలేని, అలా ఆనందం కూడా పొందలేని జీవితం తనది అని అన్నారు ముద్రగడ పద్మనాభం. తనక జరిగిన అవమానాలు, బాధలు, కష్టాలు, బూతు పురాణాలు దృష్టిలో పెట్టుకుంటే భవిష్యత్తలో ఎవరూ ఉద్యమాలు చేయడానికి రోడ్డుపైకి రారని చెప్పారు. కేసులు ఉపసంహరించినందుకు జగన్ కు ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు.