కాన్పూర్ లో దొంగని న్యూజెర్సీ నుంచి పట్టించాడు..
కాన్పూర్ లోని ఓ ఫ్యామిలీ వ్యాపార నిమిత్తం న్యూ జెర్సీకి వెళ్లింది. ఇలా వెళ్లే క్రమంలో ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టి వెళ్లారు కుటుంబ సభ్యులు. ఇంటి ఆవరణలో అంతా సీసీ కెమెరాలు పెట్టి, దాన్ని తన మొబైల్ కి అనుసంధానించారు యజమాని. సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యే అన్ని దృశ్యాలు అతని మొబైల్ లో కనపడతాయి. కొత్తవాళ్లు ఎవరు వచ్చినా, మొబైల్ లో ఓ అలర్ట్ మెసేజ్ వచ్చేలా దాన్ని అమర్చుకున్నారు. ఈ క్రమంలో ఓ రోజు రాత్రి కాన్పూర్ లోని వారి ఇంట్లోకి దొంగ ప్రవేశించాడు. వెంటనే యజమాని మొబైల్ కి అలర్ట్ మెసేజ్ వచ్చింది. దాన్ని చూసుకున్న యజమాని, ఫోన్ లోనే దొంగల్ని హెచ్చరించాడు కూడా.
అయితే అక్కడ స్పీకర్ల నుంచి వచ్చిన మాటల్ని దొంగలు లెక్కపెట్టలేదు. నేరుగా తమ పని మొదలు పెట్టారు. దీంతో యజమాని, కాన్పూర్ లోని శ్యామ్ నగర్ పోలీస్ స్టేషన్ కి ఫోన్లో సమాచారమిచ్చాడు. తాను న్యూజెర్సీలో ఉన్నానని, తన ఇంట్లో దొంగతనం జరుగుతోందని చెప్పాడు. పోలీసులు వెంటనే అతని ఇంటికి వెళ్లారు. అయితే పోలీసుల రాకను ఊహించని దొంగలు భయపడ్డారు. ఆ తర్వాత వారిపై కాల్పులు జరిపి పారిపోయారు. దొంగల ముఠాలో ఒకరిని పట్టుకోగా ముగ్గురు తప్పించుకున్నారు.