తాను ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగిని అని నమ్మించి ఒక వ్యక్తి ఏకంగా 14 పెళ్లిళ్లు చేసుకున్నాడు. వీడి పెళ్లిళ్ల మోసం దేశంలో చాలా రాష్ట్రాల్లో జరిగింది. వీటిల్లో ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్, కేరళ, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలున్నాయి. ఆయా రాష్ట్రాలకు చెందిన అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నాడు. కోట్ల రూపాయల్లో కట్నాలు తీసుకుని వారిని మోసం చేసి, పరారై తిరుగుతూ ఒడిశాలో చిక్కాడు.
ప్రస్తుతం 54ఏళ్ల వయసున్న ఈ మోసగాడు రమేష్ చంద్ర, బిందు ప్రకాష్, రమణి రంజన్, అనే పేర్లతో ఇంతకాలం చలామణి అయ్యాడు. ముఖ్యంగామ్యాట్రిమోనియల్ వెబ్ సైట్స్ లో భర్తలు వదిలేసిన మహిళలు, వితంతువులు, 40ఏళ్లు దాటినా పెళ్లి కాని వారికి గేలమేస్తాడు. కేంద్ర ఆరోగ్య శాఖలో తాను డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ని అని నమ్మిస్తాడు. ఈ విధంగా 2002 నుంచి ఇప్పటి వరకు 14మందిని పెళ్లి చేసుకున్నాడు. ఢిల్లీలో ఓ స్కూల్ టీచర్ గతేడాది ఇచ్చిన ఫిర్యాదుతో వీడి బండారం బట్టబయలైంది.
రమేష్ చంద్ర మొట్టమొదటిసారిగా 1982లో పెళ్లి చేసుకున్నాడు, ఐదుగురు పిల్లలున్నారు. ఆ తర్వాత 2002నుంచి తన సీరియల్ పెళ్లిళ్ల మోసానికి తెరతీశాడు. వీడి మోసానికి బలైనవారిలో కేంద్ర సాయుధ దళాల మహిళా అధికారి కూడా ఉన్నారు. ఆమె పంజాబ్ లో డీఎస్పీ హోదాలో ఉంది. ఆమెను పెళ్లి చేసుకుని 10లక్షల రూపాయలు కాజేశాడు. ఆ తర్వాత ఆమెతో కలసి గురుద్వారాకు పోయి వస్తూ అప్పుడు కూడా 11లక్షల రూపాయలు తీసుకుని పారిపోయాడు.
14 పెళ్లిళ్లు చేసుకోవడమే కాక, కేరళలలో 13 బ్యాంకులకు కోటి రూపాయలకు టోపీ పెట్టాడు. హైదరాబాద్ లో మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ఇప్పిస్తానని 2కోట్ల రూపాయలు ఇప్పిస్తానన్నాడు. అక్కడ కూడా ఇతడిపై కేసులున్నాయి. ఇప్పటి వరకు 14మందిని పెళ్లి చేసుకున్న రామచంద్రపై 9మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిగిలినవారు పరువుకి భయపడి ఫిర్యాదు చేసేందుకు ఇష్టపడలేదు. మొత్తమ్మీద 14 పెళ్లిళ్లు, బ్యాంకులను మోసం చేసిన కేసు, ఇతర చీటింగ్ కేసుల్లో 30 కోట్ల రూపాయలకు పైగా సంపాదించాడు.