ఆఫీస్ కి వెళ్తున్నారా, వెంట సెల్ ఫోన్ తీసుకెళ్తున్నారా.. ఇకపై మీ ఫోన్ ఇంట్లోనే పెట్టి వెళ్లండి. లేకపోతే ఆఫీస్ లోకి రానివ్వరు. ఇదేదో కామెడీ కాదు, నిజంగానే నిజం. ప్రభుత్వ ఉద్యోగులకి ఇలా షాకిచ్చింది మద్రాస్ హైకోర్టు. ప్రభుత్వ సిబ్బంది ఆఫీసు పనివేళల్లో వ్యక్తిగత అవసరాల కోసం మొబైల్ ఫోన్స్ ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. ఓ కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించి విధివిధానాలను రూపొందించాలని స్టాలిన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతే కాదు.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు సూచించింది.
తిరుచిరాపల్లిలోని హెల్త్ రీజనల్ వర్క్షాప్ విభాగంలో సూపరిండెంట్గా పనిచేస్తోన్న ఓ వ్యక్తి.. ఇటీవల ఆఫీసులో తోటి ఉద్యోగుల వీడియోలు తీశాడు. వద్దని ఎన్నిసార్లు హెచ్చరించినా తన తీరు మార్చుకోకపోవడంతో ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు. దీంతో అతడు హైకోర్టును ఆశ్రయించాడు. అతడి పిటిషన్పై నేడు విచారణ చేపట్టిన మద్రాసు హైకోర్టు.. ప్రభుత్వ సిబ్బంది ఆఫీసుల్లో తరచూ మొబైల్ వినియోగిస్తుండటంపై అసహనం వ్యక్తం చేసింది.
‘‘ఆఫీసుల్లో మొబైల్ ఫోన్లు వినియోగిస్తుండటం, ఫోన్లలో వీడియోలు తీయడం ఇటీవల తరచుగా జరుగుతున్నాయి. ఇవన్నీ తోటి ఉద్యోగులకు అసౌకర్యాన్ని కలిగించడమే గాక, ప్రభుత్వ ఆఫీసుల్లో కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నాయి. అందువల్ల ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది, ఉద్యోగులు కనీస క్రమశిక్షణ పాటించాలి. మొబైల్ ఫోన్లను వీలైతే స్విఛాఫ్ చేయాలి. లేదా వైబ్రేషన్/సైలెంట్ మోడ్లో పెట్టాలి. అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ మాట్లాడాల్సి వస్తే పై అధికారుల అనుమతి తీసుకుని ఆఫీస్ నుంచి బయటకు వెళ్లి మాట్లాడి రావాలి’’ అని హైకోర్టు స్పష్టం చేసింది.