మామయ్య అన్న పిలుపు..
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు..
హిందూ సంప్రదాయం ప్రకారం జరిపించే శుభకార్యాల సమయంలో మేనమామకు ఎంతో ప్రాధాన్యం ఉంది.. అన్నప్రాసన, చెవులు కుట్టించే వేడుక, పెళ్లిళ్ల సమయంలో.. తలనీలాలు సమర్పించే కార్యక్రమాన్ని మేనమామ సమక్షంలో నిర్వహించడం ఆనవాయితీ.. ఇవన్నీ మేనమామ చేతిగుండా జరగాల్సిన సంప్రదాయాలు.. అయితే అలాంటి సంప్రదాయాలన్నీ చేయాల్సిన మేనమామ అర్ధాంతరంగా చనిపోతే..? ఆ కుటుంబం ఎంతలా తల్లడిల్లిపోతుంది.. ఎంతలా విలవిలలాడిపోతుంది.. సరిగ్గా ఇలాంటి పరిస్థితే తమిళనాడుకు చెందిన ఓ కుటుంబానికి ఎదురైంది.
తమిళనాడులోని పండిదురై అనే యువకుడు రెండేళ్ల కిందట ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అతనికి సోదరి ప్రియదర్శిని అంటే పంచప్రాణాలు.. ఆమె కుమార్తెలన్నా కూడా పండిదురైకు ఎంతో ఇష్టం.. అయితే అకస్మాత్తుగా అతడు చనిపోవడంతో సోదరితో పాటుగా ఆమె పిల్లలు కూడా ఎంతో బాధ పడ్డారు. బ్రతికి ఉండగా తన సోదరి పిల్లలకు చెవులు కుట్టించేవేడుకను, ఘనంగా తానే జరిపిస్తానని ఎప్పుడూ చెబుతుండేవాడు. అయితే విధి వెక్కిరించి అతడిని ప్రమాదం రూపంలో తీసుకెళ్ళిపోయింది.
అయితే ఇప్పుడు పండిదురై కలలు కన్న ఆ రోజు రానే వచ్చింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు విభిన్నంగా ఆలోచించారు. మేనమామ తమకిచ్చిన మాటను ఎలాగైనా నెరవేర్చాలని భావించారు. బెంగుళూరుకు చెందిన ఓ కంపెనీతో మాట్లాడి పండిదురై సిలికాన్ విగ్రహాన్ని తయారు చేయించారు.
ఆ విగ్రహాన్ని మేనమామ దుస్తులతో అలంకరించారు. ప్రత్యేక వాహనంలో సోదరి కుమార్తెలను, మేనమామ విగ్రహాన్ని కూర్చోబెట్టి ఊరంతా ఊరేగించారు. ఆ తర్వాత సంప్రదాయబద్ధంగా పండిదురై సిలికాన్ విగ్రహం ఒడిలో పిల్లలను కూర్చోబెట్టి, చెవులు కుట్టించారు. దీంతో ఆ కుటుంబం కన్నీటి జ్ఞాపకాల్లో మునిగిపోయింది.