కొడుకు ఓ అమ్మాయిని ప్రేమించాడని తెలుసుకున్న తల్లి, వారిద్దరినీ విడదీయాలనుకుంది. కాబోయే కోడలూ రావమ్మా మా ఇంటికి అంటూ నమ్మకంగా పిలిచింది. కొడుకుతో పెళ్లి చేస్తామంటూ నమ్మబలికింది. తీరా ఇంటికొచ్చిన తర్వాత ఇనుపరాడ్ తో తల పగలగొట్టింది. కొడుకు ప్రేమకోసం రాక్షసిగా మారి మరో అమాయకురాలి ప్రాణాలు తీయబోయిన ఆ తల్లి ఉదంతం తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో జరిగింది.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని అరవింద్ నగర్కు చెందిన భరత్ చంద్ర(26), మోచీబజార్ కు చెందిన బోగని శ్రావణి(21) నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శ్రావణి డిగ్రీ చదువుతుండగా, భరత్ చంద్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. భరత్ చంద్ర తల్లిదండ్రులు ఇటీవల ఓ యువతితో వివాహం జరిపించేందుకు నిశ్చయించారు. నిశ్చితార్థం కూడా జరిపించారు. ఈనెల 27న వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పెళ్లి ఇష్టంలేని భరత్ చంద్ర, శ్రావణితో కలిసి ఈనెల 9న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఎటో వెళ్లిపోయారు. తల్లితండ్రులు భరత్చంద్రకు ఫోన్ చేశారు. ప్రేమించిన యువతితోనే వివాహం జరిపిస్తామని నమ్మించి ఇంటికి రప్పించారు. శ్రావణితో తన కుమారుడి పెళ్లి చేయడం ఇష్టంలేని తల్లి అరుణ ఇనుపరాడ్ తో శ్రావణి తల పగలగొట్టింది. తీవ్రంగా గాయపడ్డ శ్రావణిని స్థానికులు జగిత్యాల ఆస్పత్రిలో చేర్చారు, పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్ కు తరలించారు. శ్రావణికి తల్లిదండ్రులు లేరు, ఆమె తన అన్నా వదినల వద్ద ఉంటోంది.