ఇద్దరం పెళ్లి చేసుకుందాం, హాయిగా జీవిద్దాం అంటూ కమ్మని మాటలు చెప్పి ఆ అమ్మాయిని గర్భవతిని చేశాడు. తీరా పెళ్లి విషయం ఎత్తేసరికి మొహం చాటేశాడు. మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ప్రియురాలు నిలదీసే సరికి భయపడి ఆమెను కూడా పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత తల్లిదండ్రులు అతడిని తీసుకెళ్లిపోవడంతో ఇప్పుడు ప్రియురాలు ఒంటరిగా మిగిలిపోయింది. ఎనిమిది నెలల గర్భవతిని అంటూ ఆమె అత్తగారింటి ముందు ఆందోళనకు దిగింది. ఈ ఘటన తెలంగాణలోని మేడిపల్లిలో జరిగింది.
జనగాం జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన ప్రణీతకు గత ఐదు సంవత్సరాలుగా ప్రశాంత్తో పరిచయం ఉంది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో తనను పెళ్లిచేసుకుంటానని నమ్మించి యువతిని ఎనిమిది నెలల గర్భవతిని చేశాడు.
అయితే ప్రియురాలిని మోసం చేసి శ్రీజ అనే మరో అమ్మాయిని ప్రశాంత్ ఇటీవల పెళ్లి చేసుకున్నాడు. దీంతో తనకు న్యాయం చేయాలని ప్రియురాలు గట్టిగా నిలదీయడంతో ఈనెల మూడున మిర్యాలగూడ తీసుకువెళ్ళి ఒక గదిలో పెళ్ళి చేసుకున్నాడు. అంతలోనే తనకు చెప్పాపెట్టకుండా మిర్యాలగూడ నుంచి ఇంటికి వచ్చేశాడని, ఇదేంటని ప్రశ్నిస్తే అతని తల్లి దండ్రులు ప్రశాంత్ను దాచిపెట్టి తమను ఏం చేసుకుంటారో చేసుకో పొమ్మంటున్నారని వాపోయింది. తనకు న్యాయం చేసే వరకూ ఊరుకునేది లేదని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు నిరసన చేపట్టింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలను పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి కేసు విచారణ చేపట్టారు.