రకరకాల ఆన్ లైన్ మోసాలు, ఆఫ్ లైన్ మోసాలు అన్నీ వెలుగులోకి వస్తున్న ఈ రోజుల్లో ఇంకా మోసపోయేవారు ఉన్నారంటే.. అది వారి అవగాహనా రాహిత్యం అనాలా లేక, మోసం చేసేవారి సమర్థత అనుకోవాలా..? పూజల పేరుతో ఆడవాళ్లు ఇట్టే బుట్టలో పడిపోతారని గ్రహించిన ఓ ప్రబుద్ధుడు కోటి రూపాయలకు పైగా మోసం చేసిన వైనం ఇది.
పూజలు చేయిస్తే కమీషన్ వస్తుంది. కొంత పెట్టుబడి పెడితే కూర్చొన్న చోటే లక్షాధికారి అవుతారని నమ్మించిన ఓ పూజారి మహిళలకు శఠగోపం పెట్టాడు. ఇంట్లో ఒకరికి తెలియకుండా మరొకరి దగ్గర.. భారీగా డబ్బు వసూలు చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో జరిగింది. పూజారి చేతిలో మోసపోయాం న్యాయం చేయాలంటూ మహిళలు పోలీసులను ఆశ్రయించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రూ.5వేల మొదలు రూ.25 లక్షల వరకు వసూలు చేశాడు. మొత్తం రూ.కోటి పైగా వసూలు చేసి కనిపించకుండా పోయాడు.
ఎలా జరిగిందంటే..?
డిచ్పల్లి మండలం ధర్మారం (బీ)లోని ఓ ఆలయానికి గతేడాది నవంబరులో శ్రీనివాసశర్మ అనే అర్చకుడు వచ్చాడు. గ్రామస్థులు అక్కడే ఆశ్రయం కల్పించారు. నోములు, వ్రతాల కోసం వచ్చే మహిళలతో కొన్నాళ్లు ప్రత్యేక పూజలు చేయించాడు. ఆర్థిక పరిస్థితి బాగాలేదు.. గ్రహస్థితి సరిగా లేదు.. కుటుంబసభ్యుల ఆరోగ్యం బాగుండటం లేదని వచ్చేవారితో సుమంగళి పూజలు చేయించేవాడు. తనతో ఎన్ఆర్ఐలు, సినీ పరిశ్రమకు చెందిన వారు, నిర్మాతలు పూజలు చేయించుకొంటున్నారు. వాళ్లు ఇక్కడికి రాలేరని వారి పేరుపై పూజలకు పెట్టుబడి పెడితే కమీషన్ పొందొచ్చని నమ్మించాడు. రూ.10వేలు పెడితే రూ.12వేలు, రూ.15వేలు పెడితే రూ.20 వేలు తొలుత ఇవ్వడంతో అందరూ నమ్మారు. కమీషన్ డబ్బుల్లోనూ కొంత హుండీలో వేయించాడు. ఇలా కోటి రూపాయలు పోగేసుకుని అర్థాంతరంగా మాయమయ్యాడు.
ఊరు, పేరు తెలియకుండా జాగ్రత్త..
విచిత్రం ఏంటంటే అతని అసలు పేరు ఎవరికీ తెలియదు, ఊరు తెలియదు, సిమ్ కార్డ్ అతనిది కాదు, ఫోన్ కూడా వేరేవాళ్లు కొనిచ్చారు. ఇలా తనకు సంబంధించిన ఏ వివరం తెలియకుండా అత్యంత పగడ్బందీగా మహిళల్ని మోసం చేశాడు ఆ కేటుగాడు. కోటి రూపాయల మేర నష్టపోయిన మహిళలు లబోదిబోమంటూ అతడిచ్చిన చెక్కుల్ని చూపిస్తూ పోలీస్ స్టేషన్ కి పరుగులు తీస్తున్నారు.
ఇవీ చదవండి..
ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?
అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?