జబర్దస్త్ వినోదిని అలియాస్ వినోద్.. పోలీసులకు తన కష్టాలు చెప్పుకున్నారు. ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ రెడ్డిని కలసి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఇంటి విక్రయం విషయంలో ఇంటి యజమాని తన వద్ద అడ్వాన్స్ తీసుకుని మోసం చేశాడని ఆరోపించారు. గతంలో ఇదే విషయంపై కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదని చెప్పారు వినోద్ అలియాస్ వినోదిని.
వినోద్ చెబుతున్న వివరాలివి..
ప్రస్తుతం వినోద్ నివాసం ఉంటున్న అద్దె ఇంటిని విక్రయిస్తామని యజమాని గతంలో రూ.40లక్షలకు అగ్రిమెంట్ చేసుకున్నారట. ఏడాది క్రితం రూ.13.40లక్షలు అడ్వాన్సు కూడా తీసుకున్నారు. ఇప్పుడు రూ.40లక్షల కంటే ఎక్కువ ఇస్తేనే ఇల్లు అమ్ముతానని, లేని పక్షంలో అడ్వాన్సుగా ఇచ్చిన రూ.13.40లక్షలు కూడా తిరిగి ఇవ్వబోమని బెదిరిస్తున్నారు. గతంలో ఇదే విషయంపై భౌతిక దాడి చేశారు. దాడి ఘటనపై అప్పట్లో కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వినోద్ ఆరోపిస్తున్నారు. ఈమేరకు డీసీపీ రమేష్ రెడ్డిని కలసి ఆయన వినతిపత్రం అందించారు.